జగన్ కు రఘురామ మరో ట్విస్ట్- పార్టీ వేరు, ప్రభుత్వం వేరు- అలా అయితే 20 ఏళ్ల అధికారం..
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే ధిక్కార స్వరం వినిపించి అనర్హత వేటు వరకూ వెళ్లిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో ట్విస్ట్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ విధానాలపై తాను గతంలో చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ముందునుంచీ తనది ఒకే విధానం అన్నారు. పార్టీకీ, ప్రభుత్వానికీ మధ్య తేడాను గుర్తించాలని తాను కోరుతున్నానంటూ రఘురామ తెలిపారు. మీడియానే తమ సంసారంలో నిప్పులు పోస్తోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద ఆయన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోందని అర్ధమవుతోంది.
రఘురామ మరో ట్విస్ట్...
వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీ నేతలపై, ప్రభుత్వంపై వరుస విమర్శలతో వార్తలకెక్కిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు టోన్ మెల్లగా మారుతోంది. పార్టీకి, తనకూ మధ్య కొందరు విభేదాలు సృష్టించారనే అర్ధం వచ్చేలా ఆయన తాజాగా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్టీకీ, ప్రభుత్వానికీ తేడా గమనించాలని ముందునుంచీ తాను కోరుతున్నట్లు రఘురామ వెల్లడించారు. అంటే తాను విమర్శలు చేస్తున్నది పార్టీ మీద కాదు కేవలం ప్రభుత్వం మీదే అన్న అర్ధం వచ్చేలా ఆయన స్పందించారు. అయితే సొంత పార్టీ నడుపుతున్న ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారన్న అంశంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
జగన్ కు ఎప్పుడూ సలహాలివ్వలేదు..
వైసీపీ అధినేత కమ్ సీఎంగా ఉన్న జగన్ కు తాను ఎప్పుడూ సలహాలు, సూచనలు ఇవ్వలేదని.. ప్రభుత్వ విధానాలపై మాత్రమే తాను సూచనలు చేసినట్లు రఘురామరాజు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పిదాలు జరుగుతున్నాయని, వాటిని మాత్రమే తాను విమర్శించినట్లు రఘురామ తెలిపారు. తిరుమల శ్రీవారి భూముల విషయంలోనూ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడిన తర్వాతే తాను మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా జగన్ కు సన్నిహితుడైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డిని కూడా ఈ వ్యవహారంలోకి లాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
20 ఏళ్లు అధికారంలో ఉండాలనే...
పార్టీపై విమర్శలు చేయని తాను ప్రభుత్వంపై విమర్శలు చేయడం వెనుక మరో అజెండా ఉందని కూడా రఘురామకృష్ణంరాజు పరోక్షంగా చెప్పారు. తప్పిదాలు సరిచేసుకుంటే తొలిసారి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్ల పాటు అధికారంలో ఉండటం ఖాయమని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. ఇదే అభిప్రాయంతో తాను ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసినట్లు రఘురామ వెల్లడించారు. అంటే పార్టీ భవిష్యత్తు కోసమే తాను ఈ విమర్శలు చేసినట్లు భావించాలని అధిష్టానానికి ఆయన సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
మీడియా నిప్పులు పోస్తోంది.
పార్టీ, ప్రభుత్వానికి మధ్య స్పష్టమైన తేడా గమనించాలని చెప్పిన రఘురామ, మీడియా వల్లే తాను ఎవరిని విమర్శిస్తున్నానో తెలియకుండా పోయిందన్నట్లుగా చెప్పుకొచ్చారు. మీడియానే తమ కాపురంలో నిప్పులు పోస్తోందని తాజాగా ఆయన విమర్శలకు దిగారు. అంతకు ముందు అడక్కుండానే మీడియాకు వీడియో క్లిప్ లు పంపి, లైవ్ లో హంగామా చేసిన రఘురామకృష్ణంరాజు.. వైసీపీ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యే సరికి ఇప్పుడు మీడియా వల్లే తాను పార్టీకి దూరమవుతున్నట్లు చెప్పుకొస్తున్నారు. దీంతో ఆయన టోన్ లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని అర్ధమవుతోంది.