అంతర్వేది ఘటన..కుట్ర: పిచ్చి చేష్టగా కేసు క్లోజ్: వెల్లంపల్లి వద్దు: జగన్ స్వయంగా: రఘురామ
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయం వెలుపల చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. క్రీస్తుపూర్వం 300 సంవత్సాల కిందట నిర్మించిన ఈ ఆలయానికి సంబంధించిన రథం మంటల బారిన పడటం దురృష్టకరమని చెప్పారు. దీని వెనుక కుట్రకోణం ఉందని అనుమానిస్తున్నట్లు తెలిపారు.
Recommended Video
ఈ మేరకు ఆదివారం ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రథం కాలిపోయిన విధానం చూస్తుంటే ఒక కుట్ర ప్రకారమే తగులబెట్టినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఓ ప్రకటన చేయాలని అన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కాకుండా స్వయంగా ముఖ్యమంత్రే ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. రథం మొత్తం మంటల బారిన పడటాన్ని బట్టి చూస్తే.. అది ప్రమాదం జరిగినట్టుగా అనిపించట్లేదని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
ఉద్దేశపూరకంగా గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టారని, ఇందులో కుట్ర కోణం ఉందనేది స్పష్టంగా అర్థమౌతోందని చెప్పారు. షార్ట్సర్క్యూట్ జరిగితే ఇంత భారీ ఎత్తు మంటలు చెలరేగే అవకాశం లేదని అన్నారు. ఇదివరకు ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటే.. పిచ్చివాళ్లు చేసినట్టుగా భావించి కేసును మూసివేశారని రఘురామ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అంతర్వేది ఉదంతాన్ని పిచ్చివాళ్ల చర్యగా, పిచ్చి చేష్టలుగా భావించి కేసును మూసివేసే ప్రయత్నాలు సాగుతున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు.
చారిత్రక ప్రాధాన్యత ఉన్న అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో చోటు చేసుకున్న ఈ ఘటనను మతంపూ జరిగిన దాడిగా భావించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది ఆలయంలో రథోత్సవం అనేది అతిపెద్ద పండుగగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని రఘురామ అన్నారు. సంవత్సరం పొడువునా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కంటే రథోత్సవాన్ని తిలకించడానికి ఆ ఒక్కరోజే వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుందని చెప్పారు. అంత ప్రాధాన్యత ఉన్న రథం మంటల బారిన పడటం మంచిది కాదని అన్నారు.
దీన్ని పిచ్చివాళ్ల చర్యగా వదిలేయకుండా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్వయంగా డీజీపీ గౌతమ్ సవాంగ్తో మాట్లాడాలని, సమగ్ర దర్యాప్తు చేయించాలని రఘురామ డిమాండ్ చేశారు. నిందితులు ఏ మతానికి చెందిన వారైనా.. ఏ కులానికి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని లక్ష్మీనరసింహ స్వామివారి భక్తుల తరఫున తాను కోరుతున్నానని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా ఈ కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని, నిందితులు మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.