జగన్కు కోటి జీతం ఆఫర్: పనికిమాలినోళ్లకు కేబినెట్: కోర్టుల చుట్టూ: టీడీపీకి ఉప్పందించిన రఘురామ
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు.. మరోసారి తనదైన శైలిలో జగన్ సర్కార్పై చెలరేగిపోయారు. ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తూనే.. చురకలు అంటించారు. ఆయన చుట్టూ పనికిమాలిన వాళ్లందరూ సలహాదారులుగా ఉన్నారని..పైగా వారికి కేబినెట్ ర్యాంకులు ఇచ్చారని విమర్శించారు. రాజ్యాంగంలోని 164 1 ఏ ప్రకారం..పరిమితికి మించిన కేబినెట్ హోదా గల వారు ప్రభుత్వంలో ఉన్నారని ఆరోపించారు.
కోటీ రూపాయల జీతం తీసుకున్నా ఫర్వాలేదు గానీ..
మినీ రచ్చబండ పేరుతో కొద్దిసేపటి కిందటే ఆయన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ జీతం తీసుకోవట్లదని, అందుకే ఆయన పని చేయడం కూడా మానేశారేమోనని అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు. పరిపాలనను సలహాదారుల చేతుల్లో పెట్టినట్టు కనిపిస్తోందని అన్నారు. అందుకే ఆయన జీతం తీసుకోవడమే మంచిదని సలహా ఇచ్చారు. కోటి రూపాయల జీతం తీసుకున్నా అభ్యంతరం ఉండదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని 164-1ఏ ను ఉల్లంఘించి మరీ సలహాదారులకు కేబినెట్ ర్యాంకులను ఇవ్వడం సరికాదని అన్నారు.
ఎవరైనా కోర్టులకు వెళ్తే.. పరిస్థితేంటీ?
ఇదివరకు పరిమితికి మించిన కేబినెట్ బెర్తులను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వగా.. దానిపై రేవంత్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కోర్టుల్లో పిటీషన్లను దాఖలు చేశారని గుర్తు చేశారు. ఆ పని ఇప్పుడు ఎవ్వరైనా చేయొచ్చని, మళ్లీ జగన్ సర్కార్ కోర్టుల చుట్టూ తిరగక తప్పదని హెచ్చరించారు. సలహాదారులను నియమించుకోవడం తప్పేమీ కానప్పటికీ.. వారికి కేబినెట్ ర్యాంకు ఇవ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుందని రఘురామ అన్నారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ రాజ్యాంగాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన సలహాదారులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
మంత్రి పెద్దిరెడ్డి ఆ హక్కు లేదు..
రాజ్యంగబద్ధ పదవిలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను విమర్శించే హక్కు, అధికారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి లేదని రఘురామ అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇబ్బందులు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు. ఆయనను మంత్రిపదవి నుంచి తొలగించే అధికారం గవర్నర్కు ఉందని అన్నారు. ఈ పరిణామాలను అడ్డుకోవడానికి వైఎస్ జగన్ వెంటనే ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ ఇష్టానుసారంగా మాట్లాడొద్దంటూ సూచించాని అన్నారు. నలుగురైదుగురు మంత్రులు ఎక్కువగా మాట్లాడుతున్నారని చెప్పారు.
ఉద్యోగ సంఘాల నేతలపైనా
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల సమాఖ్య ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీద వెంటనే చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు. వారి ప్రవర్తన, వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదంగా ఉందని అన్నారు. ఫలితంగా- ఉద్యోగుల్లో ప్రభుత్వంపై వ్యతిరేక భావన ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏకగ్రీవ పంచాయతీలు ఏమాత్రం సరికాదని రఘురామ అన్నారు. నామినేషన్ వేసే వారిపై పోలీసులు జులం ప్రదర్శిస్తున్నారని, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. ఏకగ్రీవాల కోసం ఒత్తిళ్లను తీసుకుని రావడం సరికాదని, ఇది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని రఘురామ ఆరోపించారు.