వైఎస్ జగన్కు మళ్లీ రఘురామ లేఖ: పాదయాత్ర హామీని గుర్తు చేస్తూ: కోర్టులతో లింక్ పెట్టి
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వానికి కొరుకుడు పడని తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు రూటు మార్చారు. ఇదివరకు రోజూ సోషల్ మీడియా ద్వారా రచ్చబండ పేరుతో విలేకరుల సమావేశాలను ఏర్పాటు చేస్తూ.. సొంత పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన ఆయన లేఖల బాట అందుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు కావడంతో ప్రధాన మీడియా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటోన్న ఆయన లేఖల ద్వారా రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. తాజాగా వైఎస్ జగన్కు మరో లెటర్ రాశారు. ఈ సిరీస్లో ఇది అయిదవది.
అగ్రిగోల్డ్ సమస్యపై..
రాష్ట్రాన్ని కుదిపేసిన అగ్రిగోల్డ్ అంశాన్ని రఘురామ కృష్ణంరాజు.. తన తాజా లేఖలో ప్రస్తావించారు. 6,380 కోట్ల రూపాయల విలువ చేసే అగ్రిగోల్డ్ కుంభకోణంలో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో చేసిన హామీని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ కుంభకోణం బాధితుల్లో చాలామంది దినసరివేతన కార్మికులు, మధ్య తరగతి కుటుంబీకులు ఉన్నారని, వారిని ఆదుకుంటామంటూ పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 1,100 కోట్ల రూపాయలను విడుదల చేస్తామంటూ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారని చెప్పారు.
కోర్టులతో లింక్ పెడుతూ..
అగ్రిగోల్డ్ అంశాన్ని న్యాయస్థానాలతో లింక్ పెడుతూ తన లేఖను రాశారు రఘురామ. 2019 అక్టోబర్లో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు తొలి విడత కింద 3,69,655 మంది బాధితుల కోసం 263.99 కోట్ల రూపాయలను తమ ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. బాధితులు 10,000 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయగా.. 2019 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించుకున్నది 250 కోట్ల రూపాయలేనని గుర్తు చేశారు. ఆ మరుసటి ఏడాది నవంబర్ 9వ తేదీన తెలంగాణ హైకోర్టు తమ ప్రభుత్వం పరిహారాన్ని ఇవ్వడానికి అనుమతి ఇచ్చినప్పటికీ.. అదింకా విడుదల కాలేదని అన్నారు.
ఆస్తుల అమ్మకాలేవీ..
హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను అమ్మకానికి పెట్టి.. దాని ద్వారా వచ్చిన మొత్తంతో బాధితులకు పరిహారం చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రక్రియలో కూడా జాప్యం చోటు చేసుకుందని రఘురామ పేర్కొన్నారు. దీన్నంతటినీ బేరీజు వేసుకుని చూస్తోంటే.. అగ్రిగోల్డ్ కంపెనీ పట్ల ప్రభుత్వం.. మెతక వైఖరిని అనుసరిస్తోన్నట్లు కనిపిస్తోందని చెప్పారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నట్లు భావించాల్సి వస్తోందని అన్నారు.
1100 కోట్లు వెంటనే..
ప్రజల్లో నెలకొంటోన్న వ్యతిరేక అభిప్రాయాలను తుడిచి పెట్టేలా చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రికి సూచించారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించడానికి వెంటనే 1100 కోట్ల రూపాయలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా తాము అగ్రిగోల్డ్ పట్ల కఠినంగా వ్యవహరిస్తోన్నామనే సందేశాన్ని పంపించినట్టవుతుందని చెప్పారు. ఈ దిశగా తక్షణ చర్యలను చేపట్టాల్సిన అవసరం ఏర్పడిందని సూచించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో వెనుకంజ వేయకూడదని, న్యాయస్థానాల ఆదేశాల ప్రకారం నడచుకోవాలని అన్నారు.