ఢిల్లీని వీడని రఘురామ- కేంద్రం భద్రత కల్పించినా హస్తినలోనే...కారణాలివేనా...?
వైసీపీ తరఫున గెలిచి ఏడాది కూడా పూర్తికాకముందే తిరుగుబాటు మొదలుపెట్టిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. అధిష్టానంతో పాటు నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, ప్రజల ఆగ్రహాన్ని చవిచూశారు. చివరికి ఢిల్లీ చేరుకుని అక్కడే ఉండిపోయారు. అక్కడ ఉంటూనే ఏపీలో తనకు భద్రత లేదని, అదనపు భద్రత కావాలని కేంద్రాన్ని కోరారు. చివరకు అనుకున్నది సాధించుకున్నారు. కేంద్రం వై కేటగిరి భద్రత కల్పించాక ఆయన సొంత నియోజకవర్గం నరసాపురానికి వస్తారని అంతా భావించారు. కానీ ఆయన ఇప్పటికీ ఢిల్లీని వీడేందుకు ఇష్టపడటం లేదు. అందుకు ఆయనలో నెలకొన్న భయాలే కారణమనే ప్రచారం జరుగుతోంది.
రూటుమార్చిన వైసీపీ.. రఘురామకృష్ణంరాజు అరెస్టు తప్పదా ? ఇవాళ మరో ఎమ్మెల్యే ఫిర్యాదు...
ఇంకా ఢిల్లీలోనే రఘురామరాజు..
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కోరినట్లుగా కేంద్ర హోంశాఖ ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించి రెండు వారాలు దాటుతోంది. అయినా ఇంకా ఆయన ఢిల్లీలోని తన నివాసంలోనే ఉంటూ రోజూ రచ్చబండ పేరుతో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల యుద్ధం చేస్తున్నారు. రాష్టంలో ప్రధాన విపక్షమైన టీడీపీ నేతలను మించి పోయి మరీ రఘురామ నిత్యం సీఎం జగన్, ప్రభుత్వ పెద్దలపై విమర్శలకు దిగుతున్నారు. మధ్యమధ్యలో సలహాలు ఇస్తున్నారంటూ హంగామా చేస్తున్నారు. ఇదంతా ఓ ఎత్తయితే కేంద్రం నుంచి అదనపు భద్రత తీసుకున్నాక కూడా రాష్ట్రానికి, తన సొంత నియోజకవర్గానికి రాకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
వైసీపీ ఎమ్మెల్యేల ఎదురుచూపులు..
వైసీపీ ప్రభుత్వ విధానాలను విమర్శించడం మొదలుపెట్టాక తమ ఎంపీ రఘురామరాజుపై విమర్శలు చేయడం ప్రారంభించిన నరసాపురం ఎంపీ స్ధానం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలు.. ఇప్పటికీ అవే విమర్శలు కొనసాగిస్తున్నారు. అయితే అదే సమయంలో రఘురామరాజు నియోజకవర్గానికి ఎప్పుడొస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనాతో నియోజకవర్గం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రఘురామరాజు బాధ్యత లేకుండా ఢిల్లీలోనే ఉండిపోవడం ఏంటని వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. తాను కోరుకున్న విధంగా భద్రత కూడా తీసుకున్నారు కాబట్టి ఇక నరసాపురం వచ్చేయాలని ఆయన్ను డిమాండ్ చేస్తున్నారు.
దాడుల భయమేనా ?
తాజాగా కల్పించిన భద్రతతో పోలిస్తే దాదాపు 13 మంది ఇప్పుడు రఘురామకృష్ణంరాజు సెక్యూరిటీలో ఉన్నారు. ప్రస్తుతం ఏపీలో సీఎం జగన్, విపక్ష నేత చంద్రబాబు మినహా మరెవరికీ ఇంత భారీ భద్రత లేదు. అయినా ఇంత భద్రత తీసుకుని కూడా రాష్ట్రానికి వచ్చేందుకు రఘురామ ఇష్టపడటం లేదు. దీనికి ప్రధాన కారణం ఆయన ఎప్పటి నుంచో చెబుతున్న దాడుల భయమేనా అన్న ప్రచారం సాగుతోంది. గతంలో తన నియోజకవర్గంతో పాటు ఏపీలో తనపై దాడులు జరిగే అవకాశం ఉందని చెబుతూ కేంద్రం నుంచి ఆయన వై కేటగిరీ భద్రత పొందారు. అప్పటికీ ఇప్పటికీ పరిస్ధితిలో మార్పులేదని ఆయన భావిస్తున్నారు. అందుకే నియోజకవర్గానికి రాకుండా ఢిల్లీలోనే ఉండిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Recommended Video
ఇరుకునపడిన బీజేపీ...
రఘురామకృష్ణంరాజు అడిగిన విధంగా కేంద్ర హోంశాఖ భద్రత కల్పించిన నేపథ్యంలో దాన్ని స్వాగతించిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి రాకుండా ఢిల్లీలోనే ఉండిపోవడంతో ఇరుకునపడ్డారు. అదే సమయంలో టీడీపీకి అనుకూలంగా ఆయన చేస్తున్న కామెంట్లపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. రఘురామరాజు తమకు సలహాలు ఇచ్చే బదులు తన పరిస్ధితేంటో చూసుకోవాలని తాజాగా ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం లేదంటూ ఆయన చేస్తున్న విమర్శలపైనా బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతిమంగా రఘురామరాజుకు అదనపు భద్రత ఇచ్చి తప్పు చేశామా అన్న భావన బీజేపీ నేతల్లోనూ కనిపిస్తోంది.