రఘురాముడి దూకుడు వెనుక భారీ వ్యూహం- ఢిల్లీ అపాయింట్ మెంట్లకు కారణమదే- కీలక పదవి ?
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే కత్తులు దూస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు... భవిష్యత్ పరిణామాలకు సిద్దమైపోయాకే పోరు ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన వ్యహహారశైలిని గమనిస్తే భవిష్యత్తులో వైసీపీ తనను బహిష్కరించినా లేక అనర్హుడిని చేసినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే దిశగానే ఆయన వ్యూహాలు ఉన్నట్లు అర్దమవుతోంది. ఇదంతా గమనించే ఊరికే ఆయనకు అంత సులువుగా అవకాశం ఎందుకివ్వాలనే ధోరణితోనే వైసీపీ దీన్ని మరికొంతకాలం నాన్చాలని భావిస్తున్నట్లు సమాచారం.
కాసేపట్లో జగన్ కు రఘురామకృష్ణంరాజు సమాధానం- వివరణపై ఉత్కంఠ...
వైసీపీ బహిష్కరిస్తే....
వైసీపీ తరపున గెలిచిన ఏడాది తర్వాత ఆ పార్టీ వైఖరితో తీవ్రంగా విభేదిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన తర్వాతే పోరు ప్రారంభించినట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరుతో వైసీపీ తనను బహిష్కరిస్తే ఎంచక్కా బీజేపీలో చేరిపోవచ్చని ఆయన భావిస్తున్నట్లు వైసీపీ ఎప్పటినుంచో అనుమానిస్తోంది. ఆ అవకాశం ఇవ్వరాదనే వ్యూహంతోనే ఈ వ్యవహారాన్ని చివరి వరకూ నాన్చాలనే వ్యూహాన్ని అనుసరిస్తోంది. అయితే ఏదో రకంగా పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ సాధ్యమైనంత త్వరగా తాడోపేడో తేల్చుకోవాలనేదే రఘురామకృష్ణంరాజు ఆలోచనగా అర్దమవుతోంది.
అనర్హత వేటు వేయిస్తే....
తమ పార్టీ తరఫున గెలిచి అధిష్టానం వైఖరిపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామకృష్ణంరాజును కేవలం బహిష్కరిస్తే తన పని సలువు అవుతుందని భావిస్తున్న వైసీపీ పెద్దలు.. లోక్ సభలో అనర్హత వేటు వేయించేందుకు సిద్దమవుతున్నారు. అయితే అనర్హత వేటు పడినా వచ్చే ఉపఎన్నికలోపు బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున నరసాపురం నుంచి పోటీ చేయాలని యోచనలో రఘురామకృష్ణంరాజు ఉన్నట్లు అర్ధమవుతోంది. బీజేపీ నుంచి గెలవడం కోసమే వైసీపీ నుంచి ఉన్న పదవి వదులుకుని బయటికి వెళ్లాల్సిన అవసరం ఆయనకు లేదు. కాబట్టి బీజేపీలో అంతకు మించిన పదవి కోసం ఆయన ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.
కన్నా సీటుపై రఘురాముడి కన్ను...
గతేడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేందుకు అధిష్టానం చాలా ప్రయత్నాలే చేసింది. కానీ అవేవీ ఫలించలేదు. దీనికి ప్రధాన కారణం ఏపీలో కుల సమీకరణాలే. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన ఎంపీల్లో సుజనా చౌదరి కూడా బీజేపీ అధ్యక్ష పదవి కోసం చేయని ప్రయత్నం లేదు. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్ కు పదవి ఖరారైపోయిందని వార్తలు వచ్చినా చివరి నిమిషంలో అధిష్టానం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ప్రస్తుత పరిస్ధితుల్లో కమ్మ, కాపు, రెడ్డి సామాజిక వర్గాలకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే పరిస్ధితి లేదు. దీంతో మరో ప్రత్యామ్నాయంగా క్షత్రియ సామాజిక వర్గానికి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన బీజేపీ పెద్దలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీతో విభేదిస్తున్న రఘురామకృష్ణంరాజును దృష్టిలో పెట్టుకునే ఈ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
Recommended Video
వైసీపీపై దూకుడుకు కారణమదే...
బీజేపీలో చేరితే అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశాలుండటం, వైసీపీని ఎదిరించి బయటికి వస్తే భవిష్యత్తులో ఆ పార్టీపై పోరుకు ఉపయోగపడతాడనే అంచనాలతోనే ఢిల్లీలో రఘురామకృష్ణంరాజుకు కాషాయ నేతలు అపాయింట్ మెంట్లు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆర్ధికంగా బలవంతుడు కావడం, ప్రత్యేక వర్గం లేకపోయినా వ్యాపార వర్గాలతో సన్నిహిత సంబంధాలు, టీడీపీ నేతలతో ఉన్న అనుబంధం వంటివి రఘురామకృష్ణంరాజుకు ప్లస్ కానున్నాయి. ఈ స్ధాయిలో సానుకూలతలు ఉన్న నేత బీజేపీలో ప్రస్తుతం లేరని ఢిల్లీ పెద్దలకు సంకేతాలు పంపడంతో రఘురామకృష్ణంరాజు సక్సెస్ అయ్యారనే ప్రచారం సాగుతోంది. తనకు పరిస్దితులు అనుకూలంగా ఉన్నాయన్న అంచనాకు వచ్చిన తర్వాతే వైసీపీకి ఝలక్ ఇచ్చేందుకు ఆయన సిద్దమవుతున్నట్లు నియోజకవర్గంలో సైతం ప్రచారం సాగుతోంది.