వైసీపీ నుంచి ప్రాణహాని.. అమిత్ శాఖ అధికారులతో రెబల్ ఎంపీ రఘురామ భేటీ..
ఒకటీ రెండు కాదు.. ఏకంగా ఐదు కేసులు అవి కూడా పకడ్బందీగా ఇరుకునపెట్టేవే.. ఫిర్యాదు చేసింది కూడా సాధారణ వ్యక్తులేమీకాదు.. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు.. పోలీసు కేసులకు తోడు అంతు చూస్తామంటూ నిత్యం బెదిరింపులు.. వెరసి వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, కేంద్రం నుంచి భద్రత కల్పించాలంటూ ఢిల్లీని వేడుకున్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. అదే అంశంపై సోమవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శిని కలిశారాయన.
ఎంపీ రఘురామ బాటలో ఎమ్మెల్యే ఆనం?.. వైసీపీలో సెల్ఫీ కలకలం.. సింహపురి ఎక్స్ప్రెస్ కొత్త ఎత్తులు..
కేంద్రం నుంచి సెక్యూరిటీ కల్పించే అంశంపై హోంశాఖ కార్యదర్శిని వివరాలు అడిగానని, సొంత పార్టీ నేతలే తనపై కేసులు, బెదిరింపులకు పాల్పడుతోన్న నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల్లోనే భద్రత కోరానని, దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించొచ్చని ఎంపీ రఘురామ తెలిపారు. సోమవారం కేంద్ర హోం కార్యదర్శితో భేటీ తర్వాత ఆయనీ విషయాన్ని వెల్లడించారు.
పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుతోన్న రఘురామపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ చేసిన ఫిర్యాదు పెండింగ్ లో ఉంది. రెండు వారాలు పూర్తికావస్తున్నా దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రఘురామ చర్యలను సమర్థిస్తూ ఏపీ బీజేపీ నేతలు వరుసగా కామెంట్లు చేస్తుండటం చర్చనీయాంశమైంది. రఘురామపై స్పీకర్ నిర్ణయం మరింత ఆలస్యం కావొచ్చనే భావన వ్యక్తమవుతున్నది. ఈలోపే..
వైసీపీకి చెందిన మరికొందరు నేతల్ని కూడా తనతో కలుపుకెళ్లాలని రఘురామ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో రఘురామ దిగిన సెల్ఫీపై వైసీపీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆనం కూడా ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసిన దరిమిలా, ఆయన రఘురామతో కలిసి నడవబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది.