భావప్రకటన రాజద్రోహమా ? సీఐడీ కేసు కొట్టేయండి-హైకోర్టులో రఘురామ పిటిషన్
ఏపీలోవైసీపీ ప్రభుత్వానికీ, ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య సాగుతున్న పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. గతంలో ఏపీ సీఐడీ తన వ్యాఖ్యలపై సుమోటోగా దాఖలు చేసిన రాజద్రోహం అభియోగాల కేసులో విచారణ ఎదుర్కొంటున్న రఘురామరాజు.. తాజాగా మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లి సాధించుకున్న రెబెల్ ఎంపీ.. ఈసారి ఏకంగా కేసు కొట్టేయారంటూ హైకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదీ వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న వేళ ఈ పిటిషన్ విచారణకు రాబోతోంది.
వైసీపీ వర్సెస్ రఘురామ పోరు
ఏపీలో వైసీపీ వర్సెస్ రఘురామ పోరు కొనసాగుతోంది. గతంలో వైసీపీ తరఫున గెలిచి ఆరు నెలల్లోనే ఆ పార్టీపై పోరు ప్రారంభించిన రఘురామ.... వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా చేస్తున్న వ్యాఖ్యలతో సీఐడీ ఆయనపై రాజద్రోహం ఆరోపణలతో సుమోటో కేసు నమోదు చేసింది. దీనిపై బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టు కెక్కిన రఘురామ.. ఎట్టకేలకు ఊరట పొందారు.
ఆ తర్వాత సీఐడీ ఆయన్ను విచారణకు పిలిచినప్పుడల్లా వెళ్లాలని సుప్రీంకోర్టు షరతు పెట్టింది. అయితే ఈ ఏడు నెలల్లో సీఐడీ ఆయన్ను విచారణకు పిలవలేదు. కానీ ఆయన తన పదవిని వదులుకునేందుకు సిద్ధమై... నియోజకవర్గం నరసాపురానికి వెళ్తానని ప్రకటించగానే సీఐడీ విచారణకు నోటీసులు జారీ చేసింది. దీంతో అసలు కేసే కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టులో పిటిషన్
రాజద్రోహం ఆరోపణలతో తనపై గతంలో ఏపీ సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాదు ఈ పిటిషన్ లో పలు కీలక అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాజద్రోహం కేసు పెట్టాల్సిన అవసరాన్ని ప్రశ్నించారు.
సీఐడీ ఛీఫ్ సునీల్ కుమార్ తో తనకున్న విభేధాల్ని కూడా ప్రస్తావించారు. ప్రభుత్వంపై తాను చేసిన విమర్శల్ని సమర్ధించుకున్నారు. ఈ కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దీంతో ఇప్పుడు హైకోర్టు ఈ పిటిషన్ పై ఏ నిర్ణయం తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.
భావప్రకటన రాజద్రోహమవుతుందా?
అధికార పార్టీ అక్రమాలు, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు తెలియజేస్తుంటానని రఘురామ రాజు హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనికే తనపై సీఐడీ రాజద్రోహం కేసు పెట్టిందన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందానని, విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు తనకు సూచించిందన్నారు. ఆ తర్వాత ఏడు నెలలుగా తనను విచారణకు పిలవని సీఐడీ.. తన నియోజకవర్గం నరసాపురం వెళ్తానని చెప్పగానే నోటీసులు ఇచ్చిందన్నారు. ఇప్పటికే తనపై తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు చెప్పిన విషయాన్ని ఆయన పిటిషన్ లో గుర్తు చేశారు.
సునీల్ కుమార్ వర్సెస్ రఘురామ
సీఐడీ ఛీఫ్ గా ఉన్న పీవీ సునీల్ కుమార్ తో తనకున్న విభేధాలను కూడా ఈ పిటిషన్ లో రఘురామ ప్రస్తావించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఉన్న వారిపై సునీల్ కుమార్ కేసులు నమోదు చేసి ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని ఆరోపించారు. ఆయన్ను తాను కులం పేరుతో దూషించలేదన్నారు.
ఎస్సీ రిజర్వేషన్లు దుర్వినియోగం చేసి ఆయన ఐపీఎస్ లో చేరినట్లు తాను కేంద్రానికి ఫిర్యాదు చేశానని, ఇది పరిశీలనలో ఉందన్నారు. మంగళగిరి పోలీసులు నమోదు చేసిన రాజద్రోహం కేసు సునీల్ కుమార్ ప్రేరణతోనే నమోదు చేశారన్నారు. దీని వెనుక దురుద్దేశాలున్నాయన్నారు. కాబట్టి దీన్ని కొట్టేయాలని రఘురామ హైకోర్టును కోరారు.