అమరావతిపై రెఫరెండం ? తొందరపడి రాజీనామాలొద్దు- జగన్, పవన్కు రఘురామ సూచనలు..
అమరావతి రాజధాని కోసం టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన డిమాండ్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. రాజధాని పోరాటం కోసం రాజీనామాలు పరిష్కారం కాదని, తాను చెప్పినట్లు చేస్తే ఫలితముంటుందని పవన్ కళ్యాణ్ కు ఆయన సూచించారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే రాజీనామాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రఘురామ గుర్తు చేశారు. దీంతో రఘురామ చేసిన సూచన ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.
Recommended Video
అమరావతి కోసం టీడీపీ ఆఖరి అస్త్రం ? మూకుమ్మడి రాజీనామాల ప్రచారం- అదేం లేదంటున్న పార్టీ..
రాజధాని-రాజీనామాలు..
ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అమరావతిని రాజధానిగా కాపాడుకునేందుకు రాజీనామాలు మాత్రమే పరిష్కారమనే వాదన ఊపందుకుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలకు డిమాండ్ చేశారు. టీడీపీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, వైసీపీకి చెందిన కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు అమరావతి నుంచి రాజధాని తరలింపుకు నిరసనగా రాజీనామాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పవన్ డిమాండ్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజీనామాల కోసం పవన్ చేసిన డిమాండ్ ను వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పుబట్టారు.
రాజీనామా చేస్తే నా పరిస్ధితే...
అమరావతి రాజధాని కోసం ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే పరిస్ధితి మొత్తం తలకిందులు అవుతుందని, అప్పుడు సమస్య పరిష్కారం మన చేతుల్లో లేకుండా పోతుందని ఎంపీ రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అమరావతి కోసం తొందరపడి ఎవరూ రాజీనామాలు చేయొద్దని, దానికి బదులు రాజీలేని పోరాటం చేయాలని రఘురామ సూచించారు. ఇప్పటికే రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా దాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు. రాజీనామాలు చేస్తే చివరికి తన పరిస్ధితి వస్తుందని, రక్షణ కరవవుతుందని రఘురామ హెచ్చరించారు. తనకు మాత్రం కేంద్ర బలగాల రక్షణ దొరుకుతుందని, కానీ మిగతా వారికి సాధ్యం కాదన్నారు.
రెఫరెండమ్ కోరాలని సూచన...
అమరావతిపై రాజీనామాలకు బదులుగా ప్రజల నుంచి ఎక్కడి కక్కడ రెఫరెండమ్ కోరాలని రఘురామకృష్ణంరాజు విపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులు అమరావతిపై స్ధానికంగా ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాలని ఆయన సూచించారు. దీంతో ప్రభుత్వంపైనా ఒత్తిడి పెరుగుతుందని రఘురామరాజు తెలిపారు. అలాగే ప్రభుత్వం కూడా మూడు రాజధానులపై ప్రజల నుంచి రిఫరెండమ్ తీసుకోవాలని సీఎం జగన్ ను కూడా రఘురామరాజు డిమాండ్ చేశారు.
సాక్షిని కాదు మనస్సాక్షిని నమ్మండి...
మూడు రాజధానుల ఏర్పాటు కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్రంగా తప్పుబట్టారు. ఇచ్చిన హామీ మేరకు రూ.250 పింఛన్ పెంపు కోసం డబ్బులేనప్పుడు వేల కోట్లు పెట్టి మూడు రాజధానులు ఎలా అభివృద్ధి చేస్తారని సీఎం జగన్ ను రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. తన సొంత పత్రిక సాక్షిని కాకుండా మనస్సాక్షిని బట్టి సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాలని రఘురామ రాజు సూచించారు. అందుకే రిఫరెండం పెట్టాలని తాను కోరుతున్నట్లు రఘురామ తెలిపారు.