కాసేపట్లో జగన్ కు రఘురామకృష్ణంరాజు సమాధానం- వివరణపై ఉత్కంఠ...
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీ అధినేత జగన్, పార్టీ నేతలపై విమర్శలకు దిగిన వ్యవహారంలో షోకాజ్ నోటీసులు అందుకున్న ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ తన సమాధానం ఇవ్వబోతున్నారు. అధినేత జగన్ కు సమాధానం ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన రఘురామకృష్ణంరాజు ఇవాళ జగన్ ను కలవడం లేదా ఈ మెయిల్ ద్వారా షోకాజ్ నోటీసులపై స్పందించబోతున్నారు. పార్టీ లెటర్ హెడ్ కాకుండా మరో పేరుతో నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరాలు తెలిపిన రఘురామకృష్ణం రాజు మధ్యాహ్నం 12 గంటలలోపు జగన్కు నోటీసులపై సమాధానం ఇవ్వనున్నారు.
Recommended Video
ఇప్పటికే విజయసాయిరెడ్డికి రఘురామకృష్ణం రాజు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరుకు, తనకు నోటీసులు ఇచ్చిన వారి హోదాకు పొంతన లేదని తెలిపారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమాధానం చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ప్రజలకు కలిగిన ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.
ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నించిన ఆయన తాను జగన్కు, పార్టీకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదని తెలిపారు. ఇప్పటికే ఆయన ఢిల్లీలో ఎన్నికల సంఘం, లోక్ సభ స్పీకర్, పలువురు కేంద్రమంత్రులు, నేతలను కలిసిన రఘురామకృష్ణంరాజు... వారి అభిప్రాయాలు తీసుకున్నారు. వీటి ఆధారంగా ఇవాళ జగన్ కు సమాధానం ఇస్తేనే మేలని అనుకుంటున్నారు.