వైఎస్ జగన్పై రఘురామ మరో లేఖాస్త్రం: నాడు వైఎస్సార్..నేడు కేసీఆర్: మీకు తెలిసినా!
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన లేఖాస్త్రాల పరంపరను కొనసాగిస్తున్నారు. షోకాజ్ నోటీసును అందుకుని, ప్రస్తుతం అనర్హత వేటును ఎదుర్కొంటోన్న ఆయన వేర్వేరు అంశాలపై తరచూ ముఖ్యమంత్రికి లేఖలు రాస్తున్నారు. వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ఓ జిల్లాకు మన్యసీమ విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలంటూ కొద్దిరోజుల కిందటే వైఎస్ జగన్కు లేఖ రాసిన ఆయన రఘురామ.. ఈ సారి మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు అంశాన్ని ప్రస్తావిస్తూ తాజాగా మరో లెటర్ రాశారు.
పీవీ నరసింహా రావు శత జయంత్యుత్సవాలను నిర్వహించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. తెలుగువాడి ఘన కీర్తిని ప్రపంచం మొత్తానికీ తెలియజేసిన మహా నాయకుడిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. ఆధునిక భారత్లో సంస్కరణలకు తెర తీసిన దార్శనికుడిగా గుర్తింపు పొందారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని గుర్తు చేశారు. పీవీ శతజయంత్యుత్సవాలను నిర్వహించడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు. ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తెలుగువాడిగా పీవీ నరసింహా రావు చరిత్ర సృష్టించారని అన్నారు.
2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్ నెక్లెస్రోడ్లో గల సమాధిని పీవీ ఘాట్గా అభివృద్ధి చేశారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పీవీ శతజయంత్యుత్సవాలను నిర్వహిస్తోందని చెప్పారు. దీనికోసం 10 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, ప్రత్యేకంగా శతాబ్ది కమిటీని కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా ఆ మహనీయుడి శతజయంత్యుత్సవాలను నిర్వహించాల్సిన అవసరం ఉందని రఘురామ కృష్ణంరాజు తన లేఖలో స్పష్టం చేశారు.
Recommended Video
వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని విజ్ఙప్తి చేశారు. తన విజ్ఙప్తి పట్ల సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని కోరారు. అలాగే- పీవీ నరసింహా రావుకు భారతరత్న ప్రకటించేలా తీర్మానం చేయాలనీ ఆయన వైఎస్ జగన్ను సూచించారు. మంత్రులతో ఉపసంఘంతో కూడిన ఓ శతాబ్ది కమిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు రఘురామ చెప్పారు. పీవీ నరసింహారావు చేసిన సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పటి తరానికి ఆయన గురించి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.