నాడు శరద్ యాదవ్..నేడు రఘురామ: వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ అస్త్రం: వేటుకు సిద్ధం
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు చిక్కుల్లో పడినట్టే కనిపిస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా, క్రమశిక్షణా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనే కారణంతో ఆయనపై చర్యలను తీసుకోవడానికి వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం పావులు కదుపుతోంది. ఆయనపై వేటు వేయడానికి సన్నాహాలు చేేస్తున్నట్లు సమాచారం. పార్టీ నాయకత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు రఘురామ ఇచ్చిన సమాధానం మరింత ఆగ్రహానికి గురి చేసిందని అంటున్నారు.
సాయిరెడ్డిని ఆడేసుకున్న రఘురామ: జగన్ అనుమతి ఉందా?: పార్టీ పేరేంటో తెలుసా? నీవల్లే భ్రష్టు
వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్..
ఈ పరిస్థితుల్లో ఆయన వైఖరిని చూసీ చూడనట్టు వ్యవహరించడం సరికాదనే నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. రఘురామపై వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ టు ద పార్టీ అస్త్రాన్ని ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం.. చర్యలను తీసుకోవాల్సి వస్తే..ఆయన తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం. ఇదివరకు జనతాదళ్ (యునైటెడ్) సీనియర్ నాయకుడు శరద్ యాదవ్పై ఈ నిబంధన కిందే అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
షోకాజ్ నోటీసులో సైతం..
రఘురామ కృష్ణంరాజుకు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసులోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ టు ద పార్టీ.. అనే పదాన్ని విజయసాయి రెడ్డి ఈ షోకాజ్ నోటీసులో పొందుపరిచారు. దీనిప్రకారం.. పార్టీకి వ్యతిరేకంగా కళం విప్పిన ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు భావించాల్సి ఉంటుందని సాయిరెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు.
అయినప్పటికీ.. ఘాటుగా..
ఈ నిబంధనను స్పష్టంగా షోకాజ్ నోటీసులో పొందుపరిచినప్పటికీ.. దాన్ని పట్టించుకోలేదు రఘురామ కృష్ణంరాజు. సాయిరెడ్డిని టార్గెట్గా చేసుకుని చెలరేగిపోయారు. ఆయన ఇచ్చిన షోకాజ్ నోటీసుకు బదులు ఇస్తూ.. అనేక సందేహాలను లేవనెత్తారు. పార్టీ పేరును సైతం స్పష్టంగా చెప్పుకోలేకపోతున్నారని అన్నారు. రఘురామ ఇచ్చిన సమాధానం.. పార్టీ అగ్ర నాయకులను మరింత రెచ్చగొట్టినట్టయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనితో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
మూడు నెలల్లోనే వేటు..
వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ టు ద పార్టీ నిబంధన కింద చర్యలను తీసుకోవాల్సి వస్తే.. రఘురామ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోవడం ఖాయం. అది కూడా మూడునెలల్లోనే. ఈ నిబంధన కింద వైసీపీ నాయకులు ఫిర్యాదు చేసిన మూడు నెలల్లోపే లోక్సభ స్పీకర్.. తాము ఫిర్యాదు చేసిన సభ్యుడిపై వేటు వేయాల్సిందే. ఇదివరకు శరద్ యాదవ్పై ఈ నిబంధన కిందే వేటు వేశారు. అదే తరహాలో వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ టు ద పార్టీ నిబంధన కింద రఘురామ కృష్ణంరాజును అనర్హుడిగా గుర్తించాలని కోరుతూ.. లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేయవచ్చని అంటున్నారు.
Recommended Video
రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం..
రాజ్యంగంలోని పదో షెడ్యూల్లో పొందుపరిచిన సెక్షన్ 2 (ఎ)లో దీనికి సంబంధించిన వివరణ ఉంది. వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ టు ద పార్టీ నిబంధన కింద ఏ రాజకీయ పార్టీ అయినా చట్టసభల్లో సభ్యత్వం ఉన్న తమ పార్టీ నాయకుడిపై ఫిర్యాదు చేస్తే.. వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఈ క్లాజ్ స్పష్టం చేస్తోంది. ఇదివరకు యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ రవినాయక్ కేసులోనూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. వలంటర్లీ గివెన్ అప్ ద మెంబర్షిప్ పదాన్ని రాజీనామాగా భావించాల్సిన అవసరం లేదని పేర్కొంది.