ప్రధాని మాటా లెక్కలేదా ? సుప్రీంకు వెంటనే చెప్పండి- జగన్కు రఘురామ మరో లెఖ
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరాటంలో రఘురామకృష్ణంరాజు రోజుకో అంశంపై సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్నారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో జగన్కు వరుసగా లేఖలు రాస్తున్న రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో డిమాండ్ను ఆయన ముందుంచారు.
ఏపీలో కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ సందిగ్ధంలో పడింది. వైసీపీ సర్కార్ పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామని పదే పదే చెప్తుండగా.. విద్యార్ధులు, తల్లితండ్రులు, విపక్షాల నుంచి మాత్రం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు కూడా పరీక్షల నిర్వహణ ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రెండు రోజుల్లో పరీక్షల నిర్వహణపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో గతంలో పరీక్షల్ని రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు తెరపైకి తెచ్చారు.
కరోనా దృష్ట్యా పరీక్షల రద్దుపై ప్రధాని మోడీ జూన్ 1న నిర్ణయం తీసుకున్నారని సీఎం జగన్కు రాసిన తాజా లేఖలో రఘురామరాజు గుర్తుచేశారు. కరోనా బారి నుంచి పిల్లల్నికాపాడేందుకు ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. కానీ కరోనా విలయతాండవం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మాత్రం పిల్లల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు.
ఇప్పటికే అన్ని రాష్ట్రాల బోర్డులు పరీక్షల్ని రద్దు చేశాయని రఘురామరాజు గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించి తీరాలనే స్ధిర నిర్ణయంతో ఉందన్నారు. విద్యార్ధుల్ని ఒత్తిడికి గురి చేయకుండా తక్షణం నిర్ణయం తీసుకోవాలని రఘురామరాజు జగన్ను కోరారు. నేడే ఆ నిర్ణయాన్ని సుప్రీంకోర్టుకు చెప్పాలని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video