డోస్ పెంచుతున్నా స్పందించని వైసీపీ- కరుణించని బీజేపీ.. రఘురామ ఒంటరి పోరు..
వైసీపీ తరఫున గెలిచి ఏడాది కూడా పూర్తికాకముందే సొంత ప్రభుత్వంపై విమర్శలు గురిపెట్టిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రానురానూ ఒంటరైపోతున్నారా ? నిత్యం ఏదో ఒక అంశాన్ని పట్టుకుని విపక్ష నేత తరహాలో విమర్శలు చేస్తున్న రఘురామరాజుపై ఇటు వైసీపీ కానీ అటు బీజేపీ కానీ కనికరం చూపడం లేదా ? ఓసారి సీఎం జగన్పై, మరోసారి ఆయన చుట్టూ ఉన్న కోటరీపై విమర్శలకు దిగుతున్నా వైసీపీ నేతలు పట్టించుకోవడమే మానేశారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఒకప్పుడు రఘురామకు వంతపాడిన బీజేపీ కూడా ఆయన్ను లైట్ తీసుకోవడంతో ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఒంటరిపోరాటం చేస్తున్నారు.
తగ్గుతున్న రఘురామ గ్రాఫ్...
ఏపీలో భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా పార్లమెంటులో సైతం బలమైన పార్టీగా ఉన్న వైసీపీపై సమరసంఖారావం పూర్తించిన రెబెల్ ఎంపీ రఘురామరాజుపై ఆరంభంలో విపక్షాలు సానుభూతి ప్రదర్శించాయి. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్తో నేరుగా టచ్లోకి వెళ్లిన రఘురామరాజు విషయంలో రాష్ట్ర బీజేపీ కూడా ఆచితూచి స్పందించేది. ఇదే అదనుగా బీజేపీ అజెండాతో వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ను ఇరుకునపెట్టేందుకు ప్రయత్నించిన రఘురామ ఇదే ఫీట్ను పదేపదే నమ్ముకోవడంతో ప్రాధాన్యం కోల్పోయినట్లు కనిపిస్తోంది. వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో వై కేటగిరీ భద్రత కూడా పొందిన రఘురామ ఇప్పటికీ ఢిల్లీని వీడి రాలేకపోవడానికి కారణం ఇదేనని అర్ధమవుతోంది.
లైట్ తీసుకుంటున్న వైసీపీ...
మొదట్లో సొంత పార్టీ తరపున గెలిచి పార్టీపైనే విమర్శలకు దిగిన రఘురామరాజు విషయంలో స్ధానిక ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వ పెద్దలు కూడా సీరియస్గానే స్పందించారు. కానీ రఘురామ అదే పనిగా నిత్యం ఢిల్లీలో కూర్చుని విమర్శలకు దిగుతుండటంతో ఇక ఆయన్ను లైట్ తీసుకోవాలనే అభిప్రాయనికి వైసీపీ వచ్చేసినట్లు కనిపిస్తోంది. రఘురామ వ్యాఖ్యలపై స్పందించ వద్దంటూ పార్టీ పెద్దల నుంచి వచ్చిన సూచన మేరకు కింది స్ధాయి నేతలు కూడా ఇప్పుడు ఆయన గుర్తించి మాట్లాడటమే మానేశారు. ప్రభుత్వంపై, పార్టీపై నిత్యం విమర్శలు చేస్తున్నా వైసీపీ నుంచి కనీస స్పందన కరవవుతోంది. దీంతో ఆయన కేవలం మీడియా కోసమే మాట్లాడుతున్నారన్న భావన కలుగుతోంది.
కరుణించని బీజేపీ...
అటు బీజేపీ కూడా తొలుత రఘురామరాజు లేవనెత్తిన అంశాలపై స్పందించాలని వైసీపీని డిమాండ్ చేసేది. ముఖ్యంగా టీటీడీతో పాటు ధార్మిక సంస్ధల వ్యవహారాల్లో వైసీపీ ప్రభుత్వ తీరుపై రఘురామ చేసే విమర్శలను బీజేపీ అందిపుచ్చుకునేది. కానీ ఇప్పుడు అక్కడా పరిస్ధితి మారిపోయింది. గతంలో కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉండగా.. రఘురామకు ఆ పార్టీలో మంచి మైలేజ్ దక్కేది. కానీ ఆయన స్ధానంలో సోము వీర్రాజు బాధ్యతలు చేపట్టడంతో బీజేపీ నేతలు రఘురామను పట్టించుకోవడమే మానేశారు. అంతటితో ఆగకుండా ఉచిత సలహాలు ఇవ్వొద్దంటూ చురకలు కూడా అంటిస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీకి దూరమై బీజేపీకి దూరమై రఘురామ పరిస్ధితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది.
ఢిల్లీని వదల్లేని నిస్సహాయత..
వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందన్న కారణంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి వై కేటగిరీ భద్రత పొందిన రఘురామరాజు.. సెక్యూరిటీ కల్పించిన తర్వాత కూడా ఢిల్లీని వీడలేకపోతున్నారు. వైసీపీ నేతల నుంచి దాడుల భయం ఓవైపు, బీజేపీ స్పందిస్తుందో లేదో తెలియని వైనం వెరసి... రఘురామరాజును ఢిల్లీకే పరిమితం చేస్తున్నాయి. వాస్తవానికి వై కేబగిరి భద్రత పొందాక ఏపీకి వస్తానని, సీఎం జగన్ ఇందుకు అంగీకరించాలని కోరిన రఘురామ.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందడుగు వేయలేకపోయారు. ఎంత కేంద్ర బలగాల భద్రత ఉన్నా.. నియోజకవర్గానికి వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య పేరుతో వైసీపీ సర్కారు అరెస్ట్ చేసే ప్రమాదముందని ఆయన భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సొంత నియోజకవర్గం నరసాపురం పరిధిలో ఆయనపై నమోదైన కేసులే ఇందుకు కారణం. తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన మరికొంతకాలం ఢిల్లీకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది.