జగన్కు కట్టాల్సింది గుడి కాదు చర్చి- త్వరలో మనోధైర్య యాత్ర- రఘురామ కామెంట్స్..
సందర్భం దొరికినప్పుడల్లా వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్న రెబెల్ ఎంపీ రఘరామకృష్ణంరాజు మరోసారి రెచ్చిపోయారు. తనకు వై కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో దాన్ని స్వాగతిస్తూనే వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలకు దిగారు. ముఖ్యంగా జగన్ కు గుడి కట్టాలన్న వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆలోచనపై రఘురామ మండిపడ్డారు. పేరు చివరన రెడ్డి పదం ఉంటే చాలు వైసీపీ ప్రభుత్వం కాపాడుతోందంటూ రఘురామ ఆరోపించారు. త్వరలో రాజధాని రైతుల కోసం యాత్ర చేపడుతున్నట్లు రఘురామ ప్రకటించారు.
కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించిన రఘురామ..
వైసీపీ నేతలతో ముప్పుందనే కారణంతో తనకు అదనపు భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరిన రఘురామకృష్ణంరాజు... ఎట్టకేలకు దాన్ని సాధించుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ సందర్భంగా రఘురామరాజుకు వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో అదనపు సిబ్బంది రఘురామరాజు సెక్యూరిటీలో వచ్చి చేరనున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని రఘురామరాజు స్వాగతించారు. తనకు భద్రత కావాలని కోరుకున్న వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన దిష్టిబొమ్మలు తగులబెట్టడం, బెదిరింపులకు దిగడం వల్లే భద్రత కోరాల్సి వచ్చిందని రఘురామ వెల్లడించారు.
త్వరలో అమరావతి మనోధైర్య యాత్ర...
ఏపీలో పేరు చివరన రెడ్డి అని ఉన్నవారు అసభ్య పదజాలం వాడుతున్నారని, రాజధానిని కాపాడమంటూ గాంధేయ మార్గంలో నిరసన తెలపుతుంటే కుక్కలతో పోలుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రఘురామకృష్ణంరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. పేరు చివరన రెండు అక్షరాలు ఉన్న వారిని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. వారు వేట కుక్కలై తరిమే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని రఘురామ తెలిపారు. రాజధాని ఉద్యమంలో చనిపోయిన వారిని సీఎం పరామర్శించాలని రఘురామ డిమాండ్ చేశారు. అమరావతి కోసం పోరాడుతున్న రాజధాని రైతుల్లో ధైర్యం నింపేందుకు ఆగస్టు 20 తర్వాత మనోధైర్య యాత్ర చేపడతానన్నారు. పార్టీకి విధేయుడిగా ఉంటూనే ఈ యాత్ర చేపడతానన్నారు.
అయోధ్య భూమి పూజ రోజు జగన్ గుడి భూమి పూజా ?
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరుగుతుందంటే రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించమన్నా, ఎస్వీబీసీలో లైవ్ టెలికాస్ట్ చేయమన్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని రఘురామ ఆరోపించారు. గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు జగన్కు గుడి కట్టడాన్ని హిందువుగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జగన్ కు చర్చి లేదా ప్రేమాలయం కట్టుకోవాలని ఎమ్మెల్యే వెంకట్రావుకు రఘురామ సూచించారు. అంతేకానీ హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దన్నారు.
వైసీపీ చర్యలు హిందూ సంస్కృతిని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. అయోధ్య భూమి పూజ రోజు జగన్ దేవాలయానికి భూమి పూజ నిర్వహించడం ఎబ్బెట్టుగా ఉందని రఘురామ రాజు వ్యాఖ్యానించారు.
Recommended Video
జగన్కు కలిసొచ్చిన ఇల్లు....
ప్రజాస్వామ్యంలో ఎన్నికైన వారిని ఎలా రాజీనామా చేయమంటారంటూ మున్సిపల్ మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను రఘురామ స్వాగతించారు. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మాత్రం తనను రాజీనామా చేయాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. వారంతా బొత్స వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విభజన చట్టంలో అంశాల ఆధారంగానే రైతులు కోర్టుకు వెళ్లారని, విభజన చట్టంలో రాజధాని అని మాత్రమే ఉందని రఘురామ గుర్తుచేశారు. అందరితో చర్చించి అప్పటి సీఎం తీసుకొచ్చిన సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికీ లేదన్నారు. విభజన చట్టం మారిస్తే తప్ప వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలు చెల్లబోవన్నారు. అమరావతిలో కట్టుకున్న ఇల్లు జగన్ కు కలిసి వచ్చిందని, కాబట్టి రాజధాని ఇక్కడే కొనసాగించాలని రఘురామరాజు జగన్ ను కోరారు.