సంక్రాంతికి మొహం చాటేసిన రఘురామ- నరసాపురం రాని వైనం- తొలిసారి ఇలా
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ప్రాంతం సంక్రాంతి కోడి పందాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. నరసాపురం ఎంపీ స్ధానం పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లోనూ కోడి పందాల జోరు కనిపిస్తుంటుంది. మరోవైపు వైసీపీ రెబెల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు కూడా సంప్రదాయ కోడి పందాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. కొన్నేళ్లుగా రాజుగారు లేకుండా సంక్రాంతి కోడి పందాలకు జరిగింది లేదు. కానీ ఈసారి మాత్రం ఆయన కోడి పందాలకు దూరమయ్యారు.
గతేడాది సంక్రాంతి వేడుకలకు హాజరైన రఘురామకృష్ణంరాజు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో ఆ పార్టీకి దూరం కావడం ప్రారంభించారు. రఘురామ వరుసగా చేసిన విమర్శలపై ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం మండిపడ్డారు. రఘురామ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ సీటు పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే స్ధానిక పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత కూడా రఘురామ విమర్శలు కొనసాగాయి. దీంతో వైసీపీ ఆయనపై వేటు వేయాలని కోరుతూ లోక్సభ స్పీకర్కు సైతం ఫిర్యాదు చేసింది.
వైసీపీ నేతల నుంచి తనకు ముప్పు ఉన్నందున అదనపు భద్రత ఇవ్వాలని కేంద్రాన్ని కోరిన రఘురామకృష్ణంరాజు వై ప్లస్ కేటగిరీ భద్రత తీసుకున్నారు. కానీ అప్పట్లో కరోనా ప్రభావంతో పాటు వైసీపీ నేతల దాడుల భయంతో నరసాపురానికి రావడం మానేశారు. ఏడాది గడిచినా రఘురామ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఈ సంక్రాంతి వేడుకలకు ఆయన వస్తారని భావించినా ఎక్కడా జాడ లేదు. వాస్తవానికి సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందాలకు మద్దతుగా గతంలో రఘురామ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడారు. ప్రతీ ఏటా కోడి పందాలకు హాజరు కావడం ఆయనకు ఎంతో సరదా. కానీ ఈసారి రఘురామ లేకుండానే కోడి పందాలు సాగిపోతున్నాయి.