అన్న స్ధానంలో జగనన్న- వైఎస్, దైవదూత సెంటిమెంట్లు- రఘురామ తాజా అస్త్రం
ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో సాగుతున్న పోరాటంలో భాగంగా సీఎం జగన్ను రోజుకో విధంగా లక్ష్యంగా చేసుకుంటున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరో లేఖాస్త్రం సంధించారు. నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో రాసిన లేఖలో టీడీపీ హయాం నాటి అన్న క్యాంటీన్లను తిరిగి తెరపైకి తెచ్చారు. పేదలకు పట్టెడన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తిరిగి జగనన్న లేదా రాజన్న పేరుతో పునఃప్రారంభించాలని ఆయన కోరారు.
గతంలో అన్న క్యాంటీన్ల ద్వారా ఐదు రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రికి టిఫిన్ దొరికేదని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇవి మూతపడ్డాయని రఘురామ తెలిపారు. అన్నం పరబ్రహ్మస్వరూపమని అన్ని గ్రంధాల్లో ఉందని, అన్నదానం అన్ని దానాల్లోకెల్లా గొప్ప దానమని.. అన్న క్యాంటీన్ల ద్వారా మీరు చేసే అన్నదానం మీకు మంచి పేరు తీసుకురావడమే కాకుండా దైవదూతగా జనానికి గుర్తుండేలా చేస్తుందని రఘురామరాజు జగన్కు రాసిన లేఖలో తెలిపారు.
Recommended Video
తండ్రి వైఎస్ జయంతి సందర్భంగా జూలై 8న అన్న క్యాంటీన్లను జగనన్న లేదా రాజన్న పేరుతో పునఃప్రారంభించాలని సీఎం జగన్ను రఘురామరాజు కోరారు. గతంలో కాంట్రాక్టర్లను మార్చేందుకే వీటిని తాత్కాలికంగా మూసివేస్తున్నామని, తిరిగి ప్రారంభిస్తామని మంత్రి బొత్స చెప్పారని రఘురామరాజు గుర్తుచేశారు. గతంలో జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా త్వరలో క్యాంటీన్లు తెరుస్తామని చెప్పిన మాటలు అమలు కాలేదన్నారు. ప్రభుత్వం వీటిని నడిపించలేకపోతే ఆడంబరంగా పెళ్లిళ్లు, కార్యక్రమాలు చేసుకునే వారికి దానం ఇవ్వాలని కోరినా ఉపయోగం ఉంటుందని రఘురామ సూచించారు.