చంద్రబాబు డీజీపీపై ఒత్తిడి చేశారు, 'జగన్ తప్పించుకున్నారు, రేపు కుట్ర బయటకు అన్నారు': ఆళ్ల
అమరావతి: తమ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) విచారణను స్వాగతిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణా రెడ్డి శుక్రవారం అన్నారు.
జగన్పై జరిగిన దాడిని చంద్రబాబు ఎగతాళి చేశారన్నారు. విమానాశ్రయంలో దాడి జరిగితే ఎవరు కేసు నమోదు చేయాలన్న అంశం కూడా ఏపీ డీజీపీకి తెలియదా అని విమర్శించారు. ఈ కనీస విషయం తెలియకుంటే ఆయన డీజీపీ పదవికి అనర్హుడైనా అయి ఉండాలి లేదా చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఉండాలన్నారు.
జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!
వారి కాల్ డేటా అడుగుతా
డీజీపీ, ముఖ్యమంత్రి, విశాఖ పోలీస్ కమిషనర్ తమ పార్టీ అధినేత జగన్ పైన హత్యాయత్నాన్ని నీరుగార్చాలని చూశారని ఆర్కే ఆరోపించారు. జగన్ పైన దాడి తర్వాత ప్రెస్ మీట్ పెట్టారని, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని చెప్పారు. తాను ఎన్ఐఏ మెట్లు ఎక్కుతానని చెప్పారు. సంఘటన జరిగిన రోజు (జగన్ పైన కత్తి దాడి జరిగిన రోజు) డీజీపీ, చంద్రబాబు, ఎయిర్ పోర్టులోని క్యాంటీన్ ఓవర్ హర్షవర్ధన్ కాల్ డేటా అడుగుతానని చెప్పారు. నిందితులను భౌతికంగా లేకుండా చేస్తారేమోననే అనుమానాలు ఉన్నాయని చెప్పారు. జగన్ పైన హత్యాయత్నం కేసును ఏపీ డీజీపీ, ఏజీ నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేశారన్నారు. చట్టపరంగా అన్ని అవకాశాలు వినియోగించుకుంటామన్నారు. కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి శిక్షలు పడతాయన్నారు. తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు.. పోలీస్, న్యాయవ్యవస్థలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు.
చంద్రబాబును కాపాడేందుకు డీజీపీ ప్రయత్నించారు
దేవుడి దయతో ఈ దాడి నుంచి జగన్ తప్పించుకున్నారని ఆళ్ల చెప్పారు. జగన్ పైన విశాఖ విమానాశ్రయంలో మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో దాడి జరిగితే సాయంత్రం నాలుగు గంటలకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్నారు. కానీ మధ్యాహ్నం రెండు గంటలకే ఏపీ డీజీపీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబును కాపాడటానికి డీజీపీ యత్నించారని, ఆయనను వదిలిపెట్టబోమన్నారు. ఈ విషయాలన్నింటిని ఎన్ఏఐ ముందు పెడతామన్నారు. జగన్ తప్పించుకున్నారు.. రేపు కుట్ర బయటకు వస్తుందని ముందుగానే డీజీపీ మీడియా సమావేశం పెట్టారన్నారు.
జగన్పై హత్యాయత్నం కేసు మలుపు తిరిగింది
జగన్ పైన హత్యాయత్నం కేసు శుక్రవారం కీలక మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ఈ కేసును ఎన్ఐఏకి అప్పగించారు. కేసును ఎన్ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఐఏ ఎఫ్ఐఅర్ నమోదు చేసింది. అడిషనల్ ఎస్పీ సాజిద్ ఖాన్ను విచారణ అధికారిగా నియమించింది.
ఎన్ఐఏ విచారణ ప్రారంభం
జగన్ హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణ శుక్రవారం ప్రారంభమైంది. ఎయిర్ పోర్టులో జరిగిన హత్యాయత్నంపై సీఐఎస్ఎఫ్ అధికారులను కేంద్ర హోంశాఖ వివరణ కోరింది. సీఐఎస్ఎఫ్ అధికారి ఫిర్యాదుతో కేసును దర్యాఫ్తు చేయాలని ఎన్ఏఐను కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో దర్యాఫ్తును మరింత వేగవంతం చేయనుంది.