అదే నిజమైతే గడ్డం ఎందుకు తీయలేదు? : సతీశ్ రెడ్డిని నిలదీస్తోన్న వైసీపీ
విజయవాడ : మాటల్లో సమర్థులం అని చెప్పుకున్నా.. హామిల అమలు కోసం చేసిన శపథాలే కొన్నిసార్లు నేతల సమర్థింపును ఎండగడుతాయి. ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీశ్ రెడ్డి వ్యవహారానికి ఈ వ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. రాయలసీమలోని గండికోట రిజర్వాయర్ కు నీళ్లు తీసుకొచ్చేంతవరకు గడ్డం తీసే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన.. ఇప్పుడేమో సీఎం చంద్రబాబు వల్ల సకాలంలో వట్టిసీమ పూర్తయి రాయలసీమకు నీరందిస్తున్నట్టుగా చెబుతున్నారు.
పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి విరుద్దంగా ఉందని ప్రతిపక్షం వాదిస్తోంది. ఒకవేళ సీఎం చంద్రబాబు కృషి వల్ల రాయలసీమకు నిజంగానే నీరందితే.. సతీష్ రెడ్డి ఇంకా గడ్డం పెంచుకోవాల్సిన అవసరమేంటని? ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. చంద్రబాబు చెబుతోన్న అవాస్తవాలనే సతీష్ రెడ్డి కూడా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
రాయలసీమకు నీరు తీసుకొచ్చిన అపర భగీరథుడు సీఎం చంద్రబాబు అంటూ సతీశ్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇక ప్రతిపక్ష అధినేత జగన్ ను టార్గెట్ చేసుకుని.. లోక కల్యాణం కోసం దేవతలు చేసిన యజ్ఞాలకు రాక్షసులు అడ్డుపడినట్లుగా.. చంద్రబాబు చేస్తున్న ప్రతీ అభివృద్ధి పనికి జగన్ కూడా రాక్షసుడిలా అడ్డుపడుతున్నారని ఎద్దేవా చేశారు సతీష్ రెడ్డి. జగన్ ను కలియుగ రాక్షసుడు అంటూ తీవ్ర విమర్శ చేశారు.
ఏదేమైనా చంద్రబాబు నిజంగానే రాయలసీమకు నీరు తీసుకొస్తే.. సతీశ్ రెడ్డి ఆ గడ్డం నుంచి విముక్తి అయ్యేవాడు కదా అంటున్నారు ప్రతిపక్ష నేతలు. చంద్రబాబు చెప్పే అవాస్తవాలనే సతీశ్ రెడ్డి కూడా వల్లె వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.