నెక్స్ట్ నువ్వే: చంద్రబాబు భవిష్యత్తేమిటో తేల్చేసిన రోజా: తప్పు చేస్తే అరెస్టు చేసుకోమన్నారుగా
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత, కార్మికశాఖ మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆందోళనలను రేపింది. మరో మాజీమంత్రి, ఆయన కుమారుడు కూడా ఏసీబీ ట్రాప్లో ఉన్నారంటూ వార్తలు రావడం పట్ల టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారం ఎక్కడిదాకా తీసుకెళ్తుందోననే భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళనల్లో టీడీపీ..
చంద్రబాబు హయాంలో ప్రవేశ పెట్టిన ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు, చంద్రన్న కానుక.. వంటి పథకాలపై సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలంటూ మంత్రివర్గం తీర్మానించడం, అదే సమయంలో అచ్చెన్నాయుడు అరెస్టు కావడం టీడీపీ నేతలను మరింత ఆందోళనల్లోకి నెట్టుతోందని అంటున్నారు. ఇదే అంశంపై తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల సంస్థ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళానికి దారి తీస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి.
చట్టం ముందు అందరూ సమానులే..
చట్టం ముందు అందరూ సమానులేనని రోజా వ్యాఖ్యానించారు. అచ్చెన్నాయుడు తప్పు చేశారు కాబట్టే అరెస్టు అయ్యారని అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టుకు చంద్రబాబు నాయుడు కులం రంగు పూసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన వర్గానికి చెందిన నాయకుడు తప్పు చేసినా, అగ్రకుల నాయకులు నేరాలకు పాల్పడినా చట్టం ముందు అందరూ సమానమనేని అన్నారు. చట్టం అన్ని వర్గాల వారికీ సమానంగా వర్తిస్తుందని చెప్పారు. అంతమాత్రాన అచ్చెన్నాయుడు అరెస్టును బీసీల అణచివేతగా భావించడం చంద్రబాబు ద్వంద్వనీతికి నిదర్శనమని అన్నారు.
నెక్స్ట్ టర్న్ చంద్రబాబుదే..
అచెన్నాయుడి అరెస్టుతో అవినీతిపరులు, కుంభకోణాలకు పాల్పడిన వారు, అక్రమార్కుల ఏరివేత ఆరంభమైందని రోజా అన్నారు. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు అయిదేళ్ల పాటు ఇష్టానురాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారనే విషయం అవినీతి నిరోధక శాఖ అధికారుల దర్యాప్తుతో స్పష్టమైందని అన్నారు. తాము తప్పు చేసి ఉంటే దర్యాప్తు జరిపించుకోవచ్చని, అరెస్టు చేయొచ్చంటూ బీరాలు పలికిన టీడీపీ నాయకులు ఇప్పుడు అచ్చెన్నాయుడు అరెస్టు కావడాన్ని తప్పుపట్టడం హాస్యాస్పదంగా ఉందని రోజా చెప్పారు.
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం..
ఏపీ ఫైబర్ గ్రిడ్, చంద్రన్న కానుక, చంద్రన్న తోఫాల్లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని రోజా ఆరోపించారు. టీడీపీ నాయకులు కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని విమర్శించారు. వాటిపై సమగ్ర దర్యాప్తు జరిగితే చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. తప్పు చేసిన వారు ఖచ్చితంగా శిక్షను అనుభవించి తీరాల్సిందేనని అన్నారు. ఏ ఒక్కర్నీ తమ ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ మాటలకు అసలు విలువే లేదని అన్నారు. ప్రజల మధ్య తిరగని, ప్రజాబలం లేని నాయకుడు నారా లోకేష్ అని అన్నారు.
ఇది ట్రైలర్ మాత్రమే
అచ్చెన్నాయుడి అరెస్టు కేవలం ట్రైలర్ మాత్రమేనని రోజా అన్నారు. అసలు సినిమా ముందు ఉందని చెప్పారు. తప్పు చేసిన, అవినీతికి పాల్పడిన, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా సంపాదించిన ఏ కులానికి సంబంధించిన నాయకుడైనా శిక్ష అనుభవించడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని అన్నారు. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ.. ఇలా ఏ వర్గానికి చెందిన నాయకుడైనా సరే.. అరెస్టులు తప్పవని రోజా స్పష్టం చేశారు.