జగయ్యపేట మున్సిపాలిటీ జగన్ పార్టీదే: చిన్నా ప్రమాణం, టీడీపీ వాకౌట్
కృష్ణా: జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ అలియాస్ చిన్నా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్లో మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. టీడీపీ సభ్యుల బహిష్కరణతో ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు రిటర్నింగ్ అధికారి ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. కోరం ఉండటంతో ఇంటూరి రాజగోపాల్ ప్రమాణం చేశారు.
టీడీపీ నేతలు శుక్రవారం వాగ్వాదానికి దిగడంతో ఛైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కాగా, ఈ ఎన్నిక నిబంధనల ప్రకారం జరగలేదని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు.