ఇన్సైడర్ షాక్ -జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్లారో తెలుసా? -త్వరలో పెద్ద తలలు: సజ్జల అనూహ్య వ్యాఖ్యలు
చంద్రబాబు అవినీతికి ఆయువుపట్టు అమరావతి రాజధాని ప్రాజెక్టే అని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దర్యాప్తులో ఆయన బండారం బట్టబయలైందని అధికార వైసీపీ చెబుతుండగా.. ఏపీ హైకోర్టు మాత్రం సంబంధిత కేసులను కొట్టేసి షాకిచ్చింది. సరిగ్గా ఇదే రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మరోవైపు విజయవాడ కేంద్రంగా వైసీపీ మంత్రికి, టీడీపీ నేతకు మధ్య సవాళ్ల యుద్ధం నడిచింది. వీటన్నింటిపై సీఎం జగన్ ను ఉద్దేశించి ప్రతిపక్ష టీడీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వాటిని కౌంటర్ చేశారు. ఈ క్రమంలో ఆయన పలు అనూహ్య వ్యాఖ్యలు చేశారు..
ఐపీఎస్ ఏబీవీకి జగన్ సర్కారు మరో షాక్ -సస్పెన్షన్ మరో 6నెలలు పొడగింపు -జగన్ ఢిల్లీలో ఉండగానే
జగన్ ఢిల్లీ పర్యటన అందుకే..
విభజన హామీల ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులు, పెండింగ్ నిధులు, ఏపీకి ప్రత్యేక హోదా, ఏపీ వరదాయిని పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం తదితర అంశలను చర్చించడానికి మాత్రమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఈ పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆయన స్పష్టం చేశారు.
బీజేపీతో వైసీపీ మిలాఖత్..
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఏపీ అధికార పార్టీ వైసీపీ మిలాఖత్ అయిందని, ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో జగన్ అంటకాగుతుండటంపై ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ సహా కమ్యూనిస్టు పార్టీల నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సదరు ఆరోపణలపై సజ్జల స్పందిస్తూ.. ఏపీ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపైనే జగన్.. అమిత్ షాను కలుస్తారని. సీఎం ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీలో వైసీపీకి మరొక పార్టీ అండ అవసరం లేదనే అర్థంలో.. తాము బలహీనులము కాదని, అలాగే తమ బలాన్ని ఎక్కువగా అంచనా వేసుకోవడం లేదని, రాజకీయ పార్టీగా వైసీపీకంటూ ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయని సజ్జల అన్నారు. మరోవైపు..
కొడాలి నానికి సజ్జల సమర్థన
ఏపీ రాజకీయాలకు కేంద్రంగా ఉన్న విజయవాడలో వేడిని మరిత పెంచుతూ మంగళవారం వైసీపీ, టీడీపీ ముఖ్యుల మధ్య మాటల యుద్ధం ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను ఖండిస్తూ, గొల్లపూడిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ సిద్ధంకాగా, పోలీసులు ఆయనను అరెస్టుచేశారు. కొడాలి నాని - దేవినేని ఉమ ఎపిసోడ్లో తప్పంతా టీడీపీ వాళ్లదేనని సజ్జల అన్నారు. టీడీపీ నేతలు అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటున్నారని, వారి తాటాకు చప్పుళ్లకు వైసీపీ భయపడదని, దేవాలయాలపై దాడుల వెనుక ఎవరి హస్తం ఉందో, రాష్ట్ర ప్రజలకు ఇదివరకే స్పష్టత వచ్చిందని సజ్జల పేర్కొన్నారు. మరో కీలక అంశం..
హైకోర్టుపై ఢిల్లీలో జగన్ మంతనాలు..
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో హైకోర్టు విభజన అంశం కూడా ప్రధానమైనదేనని, కేంద్ర పెద్దలతో దీనిపైనా చర్చించే అవకాశం ఉందని ఏపీ సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని భూముల్లో జరిగిన కుంభకోణాలు, ఇన్సైడ్ ట్రేడింగ్పై మంగళవారం హైకోర్టు అనూహ్య తీర్పులు ఇవ్వడం.. నారా లోకేశ్ బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కిలారి రాజేశ్ పై దాఖలైన కేసుల్ని కోర్టు కొట్టేసిన దరిమిలా సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి భూకుంభకోణం, ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారంలో కిలారి రాజేశ్ కు సంబంధించింది చాలా చిన్న కేసు అని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని సజ్జల పేర్కొన్నారు.