బిఎసి: విజయమ్మ, గాలి వాకౌట్, రేపటి నుండి టిపై చర్చ
తెలంగాణ ముసాయిదా బిల్లును తిప్పి పంపించాలని సీమాంధ్ర టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం నిరాకరించడంతో ఆయన వాకౌట్ చేశారు. వాకౌట్ అనంతరం విజయమ్మ మాట్లాడుతూ... తాము సభకు సహకరించేది లేదని, అడుగడుగునా ఉల్లంఘన జరుగుతోందన్నారు. తుఫాను ఆపలేకపోయిన తాను విభజన తుఫానును ఆపేస్తానని కిరణ్ చెప్పారని, ఇప్పుడు మాత్రం ఆయన అధిష్టానానికి తలొగ్గుతున్నారని ఆరోపించారు. బిఎసిలో చర్చించకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశ పెడతారని ప్రశ్నించారు.
బిల్లును వెనక్కి తిప్పి పంపాలనే డిమాండుతో తాము వాకౌట్ చేశామని గాలి ముద్దుకృష్ణమ నాయుడు చెప్పారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుందని చెప్పారన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. తాము సభలో సమైక్యం కోసం పోరాడుతామన్నారు. కిరణ్ 135 రోజులుగా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
కాగా, శాసన సభ సమావేశాలను రేపటితో ముగించి జనవరి 2 లేదా 3 నుండి ప్రారంభిద్దామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రతిపాదించగా... ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చను కొనసాగించాలని పట్టుబట్టారు. రేపటితో సమావేశాలు ముగించి జనవరిలో రెండు విడతలుగా సమావేశాలు నిర్వహించుదామని ప్రభుత్వం తెలపగా టి నేతలు ససేమీరా అన్నారు. అయితే శుక్రవారం వరకు సభను నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించారు.
రేపటి నుండి తెలంగాణపై చర్చ
అసెంబ్లీని శుక్రవారం వరకు కొనసాగించాలని స్పీకర్ నిర్ణయించిన నేపథ్యంలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై బుధవారం నుండి చర్చ జరగనుంది. శుక్రవారం అసెంబ్లీ వాయిదా పడనుంది. అనంతరం జనవరిలో సమావేశాలు ఉంటాయి. శుక్రవారం వరకు తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ కొనసాగనుంది.
బిఎసి సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, విప్లు ఆరేపల్లి మోహన్, అనిల్, మంత్రులు రఘువీరా రెడ్డి, శ్రీధర్ బాబు, ఆనం రామనారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుండి మోత్కుపల్లి నర్సింహులు, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి వైయస్ విజయమ్మ, శోభా నాగి రెడ్డి, తెరాస నుండి ఈటెల రాజేందర్, హరీష్ రావు, బిజెపి నుండి యెండల లక్ష్మీ నారాయణ, సిపిఐ నుండి గూండా మల్లేష్, సిపిఎం నుండి జూలకంటి రంగారెడ్డి, మజ్లిస్ నుండి అక్బరుద్దీన్, పాషాఖాద్రీ, లోక్సత్తా నుండి జెపిలు హాజరయ్యారు. ఎప్పుడు బిఏసి సమావేశానికి పదకొండు మంది హాజరు అవుతారు. ఆరుగురిని ప్రత్యేకంగా ఆహ్వానించారు.