చంద్రబాబుకు నెత్తుటి వాంతులు: లేస్తే మనిషిని కాదంటాడు..గానీ లేవలేడు: సాయిరెడ్డి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తిన పర్యటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శలను తిప్పి కొట్టే పనిలో పడ్డారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. తనపై నమోదైన కేసులను మాఫీ చేయించుకోవడానికి, బెయిల్ రద్దు కాకుండా ఉండటానికే వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించి వచ్చారంటూ టీడీపీ నేతలు చేస్తోన్న ఆరోపణలు, విమర్శలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్నారు. జగన్ పర్యటనపై ప్రతిపక్ష నేతలు తమ అనుకూల మీడియా ద్వారా బురద చల్లే ప్రయత్నం చేస్తోన్నారంటూ మండిపడుతున్నారు.
కరోనా వైరస్ సంక్షోభ సమయంలో రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, ఎదుర్కొంటోన్న ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొస్తే.. చంద్రబాబు ఆయన బానిసలు గుండెలు బాదుకుంటోన్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్కు జాతీయ స్థాయిలో ఇమేజ్ పెరుగుతోందని, ఆయన సారథ్యంలో నీతి ఆయోగ్ సహా పలు సంస్థలు రాష్ట్రానికి అత్యుత్తమ ర్యాంకింగ్లు ఇస్తోన్నాయని చెప్పారు.
వాటిని చూసి చంద్రబాబు సహా తెలుగుదేశం పార్టీ నాయకులు, అనుకూల మీడియా తట్టుకోలేకపోతోందని విమర్శించారు. యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ గ్రాఫ్ పెరుగుతోందనే అసూయ, దుగ్ద వారిలో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. చంద్రబాబును ప్రజలు ఛీ కొట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబును ప్రజలు తిరస్కరించారనే విషయం అన్ని ఎన్నికల్లో నిరూపితమైందని అన్నారు. ఆయన రాజకీయంగా సమాధి అయిపోయారని చెప్పారు.
కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ గల బంగళా నుంచి కదలడని సాయిరెడ్డి చురకలు అంటించారు. జూమ్ మీటింగ్లో కోతలు కోస్తూ, పచ్చ మీడియాలో బాకాలతో సరిపెడుతున్నాడని ధ్వజమెత్తారు. చంద్రబాబు లేస్తే మనిషిని కాదంటాడు..గానీ లేవలేడని, బయటకు రాలేడని ఎద్దేవా చేశారు. ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టేస్తానని, ఆసుపత్రులను కట్టించేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతాడని మండిపడ్డారు. చంద్రబాబు మాటలు కోటలు దాటినా కళ్లు మాత్రం ఇల్లు దాటవని సాయిరెడ్డి విమర్శించారు