వైఎస్ జగన్ ఆశయాలకు అనుగుణంగా పాలనను పరుగెత్తించండి: విజయసాయి రెడ్డి
అమరావతి: ఇన్నాళ్ల పాటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వైఖరిని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి విధానాలను తనదైన శైలిలో తూర్పారబట్టుతూ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తన లక్ష్యాన్ని మార్చుకున్నారు. సొంత పార్టీ సారథ్యంలో ఏర్పాటైన ప్రభుత్వంపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం, కొత్త మంత్రివర్గానికి తన విలువైన సూచనలు, సలహాలను ఇవ్వడంపై ఆయన తన దృష్టిని కేంద్రీకరించారు. దీనికి అనుగుణంగా ట్వీట్లను సంధించారు.
వ్యవస్థలు నిస్తేజం.. ఉత్తేజితం చేయాలి:
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అయిదేళ్ల హయాంలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిస్తేజంగా తయారయ్యాయని విజయసాయి రెడ్డి అన్నారు. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అవినీతి నిరోధక శాఖ వంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. వాటిపై ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించేలా వ్యవహరించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై, కొత్త మంత్రివర్గంపై ఉందని సూచించారు. పోలీసు, బ్యూరోక్రసీ, రాష్ట్ర, జిల్లా స్థాయి పరిపాలన వ్యవహాలన్నీ గాడి తప్పాయని, వాటిని పట్టాలపై ఎక్కించాల్సిన అవసరం ఉందని సాయిరెడ్డి గుర్తు చేశారు.
మన ప్రభుత్వంపై కోటి ఆశలు..
అయిదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు విపిగిపోయి ఉన్నారని, అందుకే తమ పార్టీకి తిరుగులేని మెజారిటీని అప్పగించారని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో- మన ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వాటిని వమ్ము చేయకుండా పరిపాలన సాగించాలని అన్నారు. అన్ని వ్యవస్థలు నిస్తేజంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు, ఆశయాల మేరకు పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన హామీలు శరవేగంగా నెరవేర్చే దిశగా మంత్రులు దృఢ సంకల్పంతో పనిచేయాలని సాయిరెడ్డి హితబోధ చేశారు.
దేశానికే దిక్సూచి కావాలి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం యావత్ భారతదేశానికే దిక్సూచిగా మారుతుందని ఆయన అన్నారు. సుపరిపాలన అనేది కాగితాలకు పరిమితం కాకుండా, చేతల్లో చూపాలని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన కొద్దిరోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేయడం మొదలు పెట్టిందని చెప్పారు. ప్రజా సంకల్పయాత్ర పేరుతో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు పరచడం ఆరంభమైందని అన్నారు. సంక్షేమం, అభివృద్ధి పనులు జోడుగుర్రాల్లా పరుగులెత్తడం ఖాయమని సాయిరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ దిశగా వైఎస్ జగన్ అన్ని చర్యలు తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
అయిదేళ్ల పీడకల మర్చిపోయేలా..
చంద్రబాబు హయాంలోని అయిదేళ్ల పీడకలను ప్రజలు మర్చిపోయేలా వైఎస్ జగన్ పరిపాలన సాగిస్తాని సాయిరెడ్డి కితాబు ఇచ్చారు. ఎక్కడా దాపరికం లేని పారదర్శక పరిపాలనకు శ్రీకారం చుడతారని అన్నారు. ప్రతీ కార్యక్రమంలోనూ ప్రజల భాగస్వామ్యం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారని అన్నారు. మంత్రివర్గం కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్ద పీట వేస్తూ వైఎస్ జగన్ దేశంలోనే ఓ మోడల్ కేబినెట్ను ఏర్పాటు చేశారని అన్నారు. అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం ఒక వినూత్న ప్రయోగమని అన్నారు. అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మంత్రులంతా ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రమించాలని సూచించారు.