చంద్రబాబూ! తట్టా, బుట్టా సర్దుకో: అత్తగారి హెచ్చరిక
తిరుపతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి శుక్రవారం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయ జీవితం పరిసమాప్తం అయిపోయిందని లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. 2019 ఎన్నికల తరువాత రాష్ట్రంలోగానీ, దేశంలో గానీ తెలుగుదేశం అనే పేరు వినిపించకపోవచ్చని అన్నారు. ఢిల్లీ చక్రం తిప్పే పరిస్థితి ఆయనకు రాదని, రాజకీయంగా చంద్రబాబు విశ్రాంతి తీసుకునే సమయంలో ఆసన్నమైందని చెప్పారు.
ఉత్తరాంధ్రలో పట్టు నిలిచిందా: రెండు జిల్లాల నేతలకు సీఎం పిలుపు : ఎన్ని సీట్లు వస్తాయి...!
మే 23 టీడీపీకి డెడ్ లైన్..
మే 23వ తేదీ తెలుగుదేశం పార్టీకి డెడ్ లైన్ వంటిదని ఆమె చెప్పారు. చంద్రబాబు పాపాల భైరవుడిలాంటి వాడని, 23వ తేదీన ఆయన పాలన అంతమౌతుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్రంలో అనేక దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయని, వాటిపై స్పందించడానికి చంద్రబాబు ఎందుకు వెనుకాడారని నిలదీశారు. మహిళలు, విద్యార్థినులకు కనీస రక్షణ కరవైందని విమర్శించారు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. చంద్రబాబుతో అంతం కానుందని అన్నారు. ఇప్పుడు ఉన్నది ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ కాదని చెప్పారు. ఏ రోజైతే చంద్రబాబు పార్టీని, ఎన్నికల గుర్తును హైజాక్ చేశారో.. ఆనాడే అసలైన టీడీపీ కనుమరుగైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు ఎన్టీఆర్.. ఆ తరువాత వైఎస్..
ఎన్టీ రామారావు తరహాలో జనరంజకమైన పరిపాలనను అందించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని లక్ష్మీపార్వతి చెప్పారు. మరోసారి అలాంటి పరిపాలన రావాలంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో మరోసారి రాజన్న రాజ్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధించబోతోందని అన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని అన్నారు. దీన్ని ఎవరూ అడ్డుకోలేరని చెప్పారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ను అడ్డుకోవడానికి గల కారణం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూరకంగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల కావడాన్ని అడ్డుకున్నారని లక్ష్మీపార్వతి చెప్పారు. సినిమాను విడుదల చేయడానికి న్యాయస్థానం ఆదేశించినప్పటికీ.. తన అనుచరుల ద్వారా సినిమా థియేటర్లలో ప్రదర్శితం కాకుండా కుట్ర పన్నారని విమర్శించారు. దీనికి గల కారణం ఏమిటనేది ప్రజలందరికీ తెలుసని అన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలోనే కాదు.. ఎన్టీ రామారావు జీవితంలో కూడా ప్రధాన విలన్ చంద్రబాబు నాయుడేనని చెప్పారు. ఈ నెల 19వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను మరోసారి అడ్డుకోవడానికి ఆయన కుట్రలు పన్నుతారని అన్నారు.
తన వ్యక్తిత్వంపై దాడి..
మహిళ అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు తన అనుచరులతో కలిసి తన వ్యక్తిత్వంపై బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. చంద్రబాబు జీవితం అంతా తన ప్రత్యర్థులపై లేనిపోని విమర్శలు చేయడంతోనే సరిపోయిందని చెప్పారు. బట్ట కాల్చి ముఖాన వేసే వ్యక్తిత్వం చంద్రబాబుదని ఆమె ధ్వజమెత్తారు. చంద్రబాబువి మొదటి నుంచీ అడ్డగోలు రాజకీయాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు దోపిడీ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజలకు త్వరలోనే విముక్తి కలగబోతోందని అన్నారు. ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మక మార్పు రాబోతోందని చెప్పారు.
లోలోన కుమిలిపోతున్న చంద్రబాబు..
అన్ని ఛానళ్ల సర్వేలు వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాబోతున్నారని, దాన్ని చూసి తట్టుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. అందుకే చంద్రబాబు కుమిలి పోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమైందని, తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు.