Vijayasai Reddy: పవన్ ఢిల్లీ టూర్: యజమాని ఆదేశించాడు ..ప్యాకేజీ స్టార్ పాటించాడు: సెటైర్లు..!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి తనదైన శైలిలో సెటైర్లు సంధించారు. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన సందర్భంగా పవన్ కల్యాణ్.. భారతీయ జనతా పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, కేంద్రమంత్రి మురళీధరన్లను కలుసుకున్నారు. ఈ భేటీపై విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
యజమాని ఆదేశాల మేరకే..
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆదేశాల మేరకే పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శించారు. పవన్ కల్యాణ్ తన యజమాని చంద్రబాబు మాటను జవదాటే వ్యక్తి కాదని చురకలు అంటించారు. యజమాని ఆదేశాలను పాటించడంలో భాగంగా ప్యాకేజీ స్టార్ ఢిల్లీలో పర్యటించారని ఎద్దేవా చేశారు. రెండురోజుల పాటు ఢిల్లీలో గడిపినప్పటికీ.. బీజేపీ పెద్దలను కలవలేకపోయారని అన్నారు.
రాష్ట్ర బీజేపీని తన ఆధీనంలో తెచ్చుకోవడానికే..
బీజేపీ రాష్ట్రశాఖను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని సాయిరెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే చంద్రబాబు తన పర్యటన ముందుగా.. పావలా (పవన్ కల్యాణ్)ను బీజేపీ పెద్దల వద్దకు పంపించారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండబోదని అన్నారు. తన యజమానికి చెందిన తెలుగుదేశానికి మేలు జరిగేలా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
జోలె డబ్బులను పంచుకుని ఎవరి దారిన వారు..
చంద్రబాబు నాయుడు జోలె పట్టి ఊరూరా తిరుగుతున్నారని, దీనివల్ల ఆ పార్టీకి ఏదైనా ఉపయోగం ఉందా? అనే విషయాన్ని తనకు ఎవరైనా వివరించాలని సాయిరెడ్డి అన్నారు. అమరావతిని ఎలా మారుస్తారని చంద్రబాబు ప్రశ్నించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని శాపాలు పెట్టారని అన్నారు. ఉత్తుత్తి ఉద్యమాన్ని ప్రారంభించి, బంగారు నగల సేకరణకు దిగారని ధ్వజమెత్తారు. జోలెతో ఊరూరూ తిరుగుతున్నారని, చివరికి వచ్చిన డబ్బును పంచుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లి పోతారని విమర్శించారు.