ఢిల్లీలో చంద్రబాబును అందరూ ఏమని పిలుస్తారో తెలుసా?: విజయసాయి రెడ్డి టీజింగ్
Recommended Video
అమరావతి: దేశవ్యాప్తంగా 21 ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి హస్తినకు రాకపోకలు సాగిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వీ. విజయసాయి రెడ్డి మరోసారి టార్గెట్గా చేసుకున్నారు. ఢిల్లీలో ఆయనను అందరూ ఫెవికాల్ బాబా అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు.
మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదు
పిలవని పేరంటానికి వెళ్లినట్లు చంద్రబాబు అందరి ఇళ్లపై పడి ఫొటోలు దిగుతున్నారని, తాను వీళ్లను కలుపుతా వాళ్లను ఏకం చేస్తానని అంటూ తిరుగుతున్నారని విమర్శించారు. అందుకే దేశ రాజధానిలో, దేశ రాజకీయాల్లో ఉత్తరాదికి చెందిన నాయకులు చంద్రబాబుకు ఫెవికాల్ బాబా అని నిక్ నేమ్ పెట్టినట్లు చెప్పారు.
ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ బాబా రాయబారాలేమిటని, జోకులేసుకుంటున్నారని సాయిరెడ్డి చురకలు అంటించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ తమ ఆంధ్ర ప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరుమంటూ విలపించిన చంద్రబాబు ఇప్పుడు తాను చేస్తున్నదేమిటని నిలదీశారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశారని ధ్వజమెత్తారు.
ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడి పోవాలో చంద్రబాబు కంటే ఉత్తరాది రాజకీయ నాయకులకు బాగా తెలుసని అన్నారు. లగడపాటి ఎగ్జిట్ పోల్ సర్వేను నమ్మి ఎగ్జయిట్ అయిన తెలుగు తమ్ముళ్లు 23 తర్వాత తేడా వస్తే చంద్రబాబును నిలదీసేటట్టు ఉన్నారని చెప్పారు. పార్టీ ఓడి, బెట్టింగుల్లో నష్టపోయిన వాళ్లంతా ఊరుకుంటారా? అని అనుమానానలు వ్యక్తం చేశారు. వారి నుంచి తనను తాను రక్షించుకోవడానికి లోక్సభ మాజీ సభ్యుడైనందున లగడపాటి రాజగోపాల్ పోలీసుల రక్షణను కోరవచ్చని చెప్పారు. రాజగోపాల్ సర్వేలో ఆయన మెదడును డీఎన్ఏ డామినేట్ చేసిందని విమర్శించారు.