విజయసాయి రెడ్డికి కీలక పదవి: ఇక ఢిల్లీ బాధ్యతలు ఆయనకే?
న్యూఢిల్లీ: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విధంగా అధికారంలోకి రావడం వెనుక పకడ్బందీగా వ్యూహాలను రచించిన వారిలో కీలక నాయకుడు వీ విజయసాయి రెడ్డి. క్షేత్రస్థాయి నుంచి పక్కా సమాచారాన్ని రాబట్టుకుని, దానికి అనుగుణంగా పావులు కదిపారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో కలిసి పని చేశారు. తెర వెనుకే ఉంటూ తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. తటస్థులను పార్టీ వైపు మొగ్గు చూపించేలా చేయడంలో విజయవంతం అయ్యారు.
ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడు..?జగన్ ఆ నిర్ణయం తీసుకోగలరా.. రాష్ట్ర ప్రజల అయిదేళ్ళ నిరీక్షణ
దృష్టి అంతా హోదా మీదే..
ప్రస్తుతం ఆయన దృష్టి అంతా కేంద్రంపై నిలిచింది. రాష్ట్రాభివృద్ధికి జీవనాడిగా భావించే ప్రత్యేక హోదాను సాధించుకోవడంతో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు, ఇతర ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవడంపై విజయసాయి రెడ్డి దృష్టి సారించారు. దీనికోసం ఆయనకు బాధ్యతాయుతమైన పదవిని అప్పజెప్పబోతోంది వైఎస్ జగన్ సారథ్యంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం.
న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక/అధికార ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమించవచ్చని తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాను ఆయనకు కల్పించి, అధికార ప్రతినిధిగా బాధ్యతలను అప్పగిస్తారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఇదివరకు దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కంభంపాటి రామ్మోహన్ రావును నియమించిన విషయం తెలిసిందే. ఇంచుమించు- అదే స్థాయి బాధ్యతలను విజయసాయి రెడ్డి చేతుల్లో పెట్టవచ్చిన అంటున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం స్థాయిలో ప్రభావితం చేయగలరా?
నిజానికి- విజయసాయి రెడ్డికి ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలే ఉన్నాయి. గట్టి పట్టు కూడా ఉంది. ప్రధానమంత్రి కార్యాలయంలో సైతం చక్రం తిప్పగల శక్తిసామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. దీనికి నిదర్శనం- చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విడుదల చేసిన ఫొటోలే. సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయంలో కాలు మీద కాలేసుకుని విజయసాయి రెడ్డి కూర్చున్న ఒకట్రెండు ఫొటోలను అప్పట్లో తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్..భారతీయ జనతాపార్టీలో చేరబోతోందడానికి ఈ ఫొటోలే సాక్ష్యాలంటూ అప్పట్లో టీడీపీ నాయకులు వాటిని మీడియాకు ఇచ్చారు.
కలుపుగోలు మనస్తత్వం..
బీజేపీ ఒక్కటే కాదు.. కాంగ్రెస్ అధిష్ఠానంతో కూడా సాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆయనకు ప్రత్యేక అధికార ప్రతినిధి హోదాను ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పార్టీలో కూడా చర్చించినట్లు సమాచారం. అదే జరిగితే- ఈ నెల 8వ తేదీన మంత్రివర్గ ఏర్పాటు సందర్భంగా- విజయసాయి రెడ్డిని న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక లేదా అధికార ప్రతినిధిగా ప్రకటించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన జీవో కూడా అదే రోజు విడుదల కావచ్చని సమాచారం.
కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం అంచనా వేయలేకపోయింది. బీజేపీ 250 సీట్ల దాకా వచ్చి ఆగిపోయి ఉంటే బాగుండేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వంటి తటస్థ తటస్థులతో బీజేపీకి ప్రస్తుతానికి ఎలాంటి రాజకీయ అవసరమూ లేదు.
కేంద్రాన్ని ఒప్పించాలంటే.
ఈ నేపథ్యంలో- వైఎస్ జగన్ ప్రభుత్వం పెట్టే షరతులు, డిమాండ్లను చెవికెక్కించుకోవాల్సిన పనీ లేదు. ఇలాంటి స్థితిలో- విజయసాయి రెడ్డి వంటి అజాత శతృవును ఢిల్లీలో కీలక బాధ్యతల్లో నియమించాల్సిన అవసరం వైఎస్ జగన్ ప్రభుత్వానికి ఉంది. అందుకే- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలతో సాయిరెడ్డి ఉన్నసన్నిహిత సంబంధాలు, ఆశించిన స్థాయిలో పరిచయాలు, కలుపుగోలు మనస్తత్వం.. ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు కొంత మేరకైనా దోహదం చేస్తాయనేది వైఎస్ఆర్ సీపీ నేతల మనోగతం.