జగన్ ఒక్క కనుసైగ చేస్తే చాలు! ఎవ్వరూ మిగలరు: ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్
నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్.. షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా మారింది. వైఎస్ఆర్ సీపీ తరఫున నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యానాలపై దుమారం చెలరేగింది. పోలింగ్ కొద్దిరోజుల ముందు- వెలుగులోకి వచ్చిన ఈ వీడియో వెలుగు చూడటం వల్ల వైఎస్ఆర్ సీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వీడియో ద్వారా వైసీపీ నేతల గూండాయిజం బయటపడిందని టీడీపీ ఆరోపిస్తుండగా, ఇది పాత వీడియో అని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు. పోలింగ్ ముంగిట్లో ఇలాంటి చీప్ ట్రిక్కులకు తెలుగుదేశం పార్టీ తెర తీసిందని అంటున్నారు.
జాతీయ నేతలు జగన్ క్రెడిబిలిటీని పెంచుతున్నారా? జగన్ ను తిట్టట్లేదెందుకు? చంద్రబాబులో అంతర్మథనం
చంపటమా? చావటమా?
పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ అత్యంత వివాదాస్పదమైన కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. `మన ముందు ఉన్నది ఒక్కటే. చంపటమా? చావటమా? ఇంకొకటి లేదు. విజయమా? వీర స్వర్గమా? అంతే! 2019లో ఈ రాష్ట్రంలో ఎగరాల్సిన జెండా ఒక్కటే. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఒక్క కనుసైగ చేసిన నాడు ఎవ్వరూ మిగలరని తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సైనికులు ఇక్కడ ఉన్నారు. జగన్ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆవేశంగా కనిపించారు. జగన్ కోసం ప్రాణత్యాగం చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
ఈసీ దృష్టికి వీడియో
అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యానాలపై రాజకీయ దుమారం చెలరేగింది. పోలింగ్ ముంగిట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అభ్యర్థులకు ఇదొక అస్త్రంలా మారింది. సామాజిక మాధ్యమాల్లో వాళ్లు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. వాట్సప్ లల్లో షేర్ చేస్తున్నారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే.. రౌడీల రాజ్యం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యానాలపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం సాయంత్రం టీడీపీ నాయకులు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలను పరిశీలించి, అనిల్ కుమార్ యాదవ్ పై అనర్హత వేటు వేయాలని తెలుగుదేశం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. రాష్ట్రంలో అశాంతి చెలరేగుతుందనడానికి ఇదే సాక్ష్యమని అంటున్నారు.
పాత వీడియో అంటూ తేలిగ్గా తీసుకున్న వైఎస్ఆర్ సీపీ
అనిల్ కుమార్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యానాలు చేయటం నిజమే అయినప్పటికీ.. ఆ వీడియో ఇప్పటిది కాదని వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు. కొన్ని నెలల కిందట పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో అనిల్ ఈ వ్యాఖ్యానాలు చేశారని, అప్పట్లో కూడా ఈ వీడియోను చూపించి, తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై ఆరోపణలు చేశారని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సీపీ నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని అంటున్నారు. అనిల్ కుమార్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యానాలపై ఇదివరకు పోలీసులు కేసు నమోదు చేశారని చెబుతున్నారు. పాత వీడియోను కొత్తగా వెలుగులోకి తీసుకొని వచ్చి, తమ ఇరుకున పెట్టడానికి తెలుగుదేశం పార్టీ చీప్ ట్రిక్స్ ను ఉపయోగిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రజలను మభ్య పెట్టడానికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కొన్ని మీడియా సంస్థలు తమవంతు సహకారం అందిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. పాత వీడియోను కొత్తగా చూపడం వెనుక.. రాజకీయ లబ్ది మాత్రమే ఉందని అంటున్నారు.