'4ఏళ్లలో మూడున్నర లక్షల కోట్లు దోచేశారు, బాబు పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి'
నెల్లూరు: రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే.. అది వైసీపీయే అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
నవ నిర్మాణ దీక్ష పేరుతో సీఎం చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని ఆరోపించారు.
చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకలించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీక్షల పేరుతో ప్రజలను మరింత వంచించడానికి చంద్రబాబు సిద్దమయ్యారని, గత నాలుగేళ్లలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారని భూమన ఆరోపించారు.
మోడీ అహంకారి, బాబు అసమర్థుడు: వరప్రసాద్
ప్రధాని నరేంద్ర మోదీ ఓ అహంకారి అని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధుడని.. అందుకే ఏపీకి సంజీవని లాంటి హోదా రాలేదని వైసీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు. హోదా రాకపోవడానికి 40 శాతం కేంద్ర తప్పిదాలు కారణమైతే, 60 శాతం అసమర్ధుడైన చంద్రబాబుదే కారణమని ఆరోపించారు. బీజేపీ, టీడీపీ రెండూ కలిసి రాష్ట్రాన్ని మోసగించాయని మండిపడ్డారు.
ఏపీ సీఎం చంద్రబాబు చేపడుతున్న నవనిర్మాణ దీక్షలకు వ్యతిరేకంగా, ఆయన వైఖరిని నిరసిస్తూ శనివారం నెల్లూరులో వైసీపీ 'వంచనపై గర్జన' దీక్ష చేపట్టింది. దీక్షలో మాట్లాడిన ఎంపీ వరప్రసాద్ ఈ కామెంట్స్ చేశారు. ఇక మరో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా రావడంలో చంద్రబాబే ప్రధాన అడ్డంకిగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు మోసాలను ఎండట్టేందుకే వంచన గర్జన దీక్షను చేపట్టామని స్పష్టం చేశారు.