గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాయి రెడ్డికి షాకిచ్చిన వైసీపీ సోషల్ మీడియా: ఐడీ కార్డులు, ప్రశంసాపత్రాలతో కడుపు నిండదంటూ అసహనం

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డికి సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం కార్యకర్తలు పలువురు విజయసాయి రెడ్డి సమక్షంలో తమ అసహనాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ ఇచ్చే గుర్తింపు కార్డులు, ప్రశంసాపత్రాలతో తమ కడుపు నిండదని నిర్మొహమాటంగా తేల్చేశారు. నిఖార్సయిన సోషల్ మీడియా కార్యకర్తలకు గుర్తింపు దక్కట్లేదని వాపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం పార్టీలో చేరిన వారిని ఆదరిస్తున్నారని తన ఆవేదన వ్యక్తం చేశారు.

వలంటీర్లకు గుర్తింపు కార్డులు..

వలంటీర్లకు గుర్తింపు కార్డులు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం రాష్ట్రస్థాయి వలంటీర్ల సమావేశం ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సమావేశానికి విజయసాయి రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. తొలుత- విజయసాయి రెడ్డి మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రావడం వెనుక సోషల్‌ మీడియా వలంటీర్లు అద్భుతంగా పని చేశారని ప్రశంసించారు. తెలుగుదేశానికి వంత పాడుతున్న ప్రధాన మీడియాను అధిగమించి, పార్టీ లక్ష్యాలు, మేనిఫెస్టోను గ్రామస్థాయికి తీసుకెళ్లారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతి ఒక్కరి వద్దకూ వెళ్లడంలో సోషల్ మీడియా వలంటీర్ల పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. ప్రతి సోషల్ మీడియా వలంటీర్ కు పార్టీ తరఫున గుర్తింపు కార్డులను ఇస్తామని అన్నారు.

కేసులను ఎత్తివేస్తాం..

కేసులను ఎత్తివేస్తాం..

సోషల్ మీడియా వలంటీర్ల కృషి వల్లే అఖండ మెజారిటీని సాధించగలిగామని సాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలు, వలంటీర్లపై గత ప్రభుత్వం బనాయించిన కేసులన్నింటినీ ఎత్తి వేస్తామని హామీ ఇచ్చారు. ఈ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్ర డీజీపీకి వినతి ప్రతాలు అందజేశామని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎక్కడైనా కేసులు నమోదయితే ఆ విషయాన్ని వెంటనే పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. సోషల్‌ మీడియా వలంటీర్ల సమస్యల పరిష్కారానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేశామని, దీని సేవలను వినియోగించుకోవాలని సాయిరెడ్డి సూచించారు.

ప్రభుత్వ పథకాలు జనంలోకి..

ప్రభుత్వ పథకాలు జనంలోకి..

వలంటీర్ల శ్రమను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి విస్మరించబోరని, వారిని సదా గుర్తుంచుకుంటారని అన్నారు. పార్టీకి పలు విభాగాలు ఉన్నప్పటికీ.. తొలి సమావేశాన్ని సోషల్ మీడియాతోనే ఏర్పాటు చేయడం వల్ల ఈ విభాగానికి ఆయన ఇచ్చే విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ముందు ఎలా పనిచేశారో ఇప్పుడు కూడా అంతకు రెట్టింపుగా పని చేయాలని, ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కోరారు. అవినీతి నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారన్నారు. అవినీతి రహిత పాలన కోసం జగన్‌ అన్న చేస్తున్న కృషిని ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. అనంతరం వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు.

మధ్యలో వచ్చిన వారికి అందలం..

మధ్యలో వచ్చిన వారికి అందలం..

అనంతరం- పలువురు సోషల్ మీడియా కార్యకర్తలు ప్రసంగించారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. గుర్తింపు కార్డుల వల్ల ఉపయోగం ఉండదని, ప్రశంసా పత్రాలు కడుపు నింపవని అన్నారు. నిఖార్సయిన కార్యకర్తలను గుర్తించి, వారిని అక్కున చేర్చుకోవాలని కోరారు. మధ్యలో వచ్చిన వారికి అందలం ఎక్కిస్తున్నారని, పార్టీ ఆరంభం నుంచీ ఉన్న వారిని పక్కన పెడుతున్నారని పలువురు సోసల్ మీడియా వలంటీర్లు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. తమ అభిమాన నాయకుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యంతో తాము పని చేశామని, దీనికోసం రాజకీయ ప్రత్యర్థుల నుంచి తిట్లు తిన్నామని, అనరాని మాటలను అనిపించుకున్నామని, పెయిడ్ బ్యాచ్ అంటూ అవమానాలను భరించామని చెప్పారు. తమ కృషికి తగ్గ ఫలితం దక్కట్లేదని వారు వాపోయారు. అయినప్పటికీ- తాము వైఎస్ జగన్ ను వీడేది లేదని, ఎన్ని అవమానాలు ఎదురైనా పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. మడమ తిప్పని పోరాటం చేసి, అద్భుత విజయాన్ని అందుకున్న వైఎస్ జగన్ ను స్ఫూర్తిగా తీసుకుంటామని అన్నారు.

English summary
YSR Congress Party Social Media wing leader was organized a State level meeting at Thadepalli in Guntur District on Sunday. Party Senior leader and Rajya Sabha member V Vijayasai Reddy was participated in this meeting as Chief Guest. He gave assurance to the Social media volunteers and supporters that Filthy cases against the supporters by the past Government should be revoked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X