కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనకు వైసీపీ మద్దతు: పార్థసారథి
విజయవాడ: కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల తొలగింపుకు ఏపీ ప్రభుత్వం సిద్దపడటాన్ని వైసీపీ నేత, మాజీ మంత్రి పార్థసారథి తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారంనాడు విజయవాడలో పార్థసారథి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు హయంలో 143వ, జివో ద్వారా ఎనిమిదివేల మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లను నియమించారని ఆయన గుర్తుచేశారు.
ఇంటర్మీడియట్ వ్యవస్థకు కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు మూలస్థంబాలుగా నిలుస్తారని పార్థసారథి అభిప్రాయడ్డారు. ఒక్కొక్కరూ పదేళ్ళ సీనియారిటీతో పనిచేస్తున్నారని, వారిని అర్థాంతరంగా తొలగించాలని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సిద్దపడటాన్ని ఆయన తప్పుబట్టారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే కాంట్రాక్ట్ లెక్చర్లకు న్యాయం జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే వారి జీతాలను రూ.9 వేల నుండి రూ.18వేలకు పెంచినట్టు పార్థసారథి గుర్తుచేశారు.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించారన్నారు. ఎన్నికల్లో ఒప్పంద ఉద్యోగులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు అనేకహమీలను ఇచ్చిన చంద్రబాబునాయుడు హమీలను విస్మరించారని పార్థసారధి ఆరోపించారు.
కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల క్రమబద్దీకరణ కోసం చేసే ఉద్యమానికి వైసీపీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందని ఆయన ప్రకటించారు.