రేపటి రాష్ట్రబంద్కు వైసీపీ సంఘీభావం- ఒంటిగంట వరకూ ఆర్టీసీ బస్సులకు బ్రేక్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాల పిలుపుమేరకు జరుగుతున్న రేపటి రాష్ట్రబంద్కు సంఘీభావం ప్రకటించాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు బంద్కు మద్దతుగా రేపు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఆర్టీసీ బస్సులను తిప్పబోమని రవాణామంత్రి పేర్నినాని ఇవాళ ప్రకటించారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన రాష్ట్రబంద్కు ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. బంద్లో నేరుగా పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసేందుకు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాము కూడా సంఘీభావం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని రవాణామంత్రి పేర్నినాని ప్రకటించారు. ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలనేది వైసీపీ ప్రభుత్వ డిమాండ్ అని పేర్నినాని పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ ఉక్కును కాపాడుకునే ప్రత్యామ్నాయాలను సీఎం జగన్ కేంద్రం ముందుంచారని నాని తెలిపారు.
రేపటి రాష్ట్రబంద్ నేపథ్యంలో ప్రజా జీవితం పూర్తిగా స్తంభించిపోకుండా ఆర్టీసీ బస్సుల్ని మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే నడపరాదని నిర్ణయించామని పేర్ని నాని తెలిపారు. ఆ తర్వాత ప్రజలకు అసౌకర్యం కలుగకుండా బస్సులు తిరిగేలా సహకరించాలని ఇతర పార్టీల్ని కోరింది. మధ్యాహ్నం కార్మికులు విధులకు హాజరు కావడం ద్వారా ఉక్కు ప్లాంట్కు సంఘీభావం ప్రకటించాలని మంత్రి కోరారు. వ్యాపారం కేంద్రం బాధ్యత కానప్పటికీ,, ప్రతీ వస్తువు ప్రైవేటు చేతుల్లో ఉంటే ధరల నియంత్రణ కష్టం కాబట్టి ప్రజావసరాలకు తగినట్లుగా కొన్ని కచ్చితంగా ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలన్నది తమ విధానమని పేర్నినాని తెలిపారు.