చంద్రబాబుపై వైసీపీ అంచనాలివే ? అలా చేస్తే కొంపమునగడం ఖాయం- సజ్జల అలర్ట్ పై చర్చ
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఇచ్చిన వందలకొద్దీ హామీలపై వైసీపీ నిత్యం విమర్శలు చేసేది. హామీలు అమలు కావడం లేదంటూ ప్రజల్లోకి తీసుకెళ్లేది. చివరికి తాము మరింత భారీగా హామీలు ఇచ్చింది. చివరికి వాటిని నెరవెర్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. అయితే అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన హామీల వ్యవహారం ఇప్పటికీ వైసీపీకి గుర్తుండిపోయింది. దీంతో 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు ఏం చేయబోతున్నారనే దానిపై వైసీపీ కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబు హామీల కథ
ఏపీలో 2014 ఎన్నికల్లో అధికారంలోకి రాకముందే పదేళ్ పాటు చంద్రబాబు అధికారానికి దూరంగా ఉన్నారు. గతంలో 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హమీలు ఎంతగానో ఉపయోగపడ్డాయనే ప్రచారం అప్పటికే ఉంది. దీంతో 2009 ఎన్నికల్లో కొత్తగా భారీ హామీలేవీ ఇవ్వకుండానే వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగలిగారు. ఆయన మరణం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా వైఎస్ ఇచ్చిన హామీల్ని, తెచ్చిన పథకాల్ని కాస్త అటుఇటుగా అమలు చేశాయి. దీంతో 2014 నాటికి హామీలపై చంద్రబాబు మోజు విపరీతంగా పెరిగింది. చివరికి భారీ ఎత్తున వందలకొద్దీ హామీలు ఇచ్చిన చంద్రబాబు ఎట్టకేలకు అధికారంలోకి రాగలిగారు. అయితే అధికారాన్ని చేపట్టిన తర్వాత వాటిని అమలు చేసే విషయంలో ఆర్ధిక ఇబ్బందులతో వెనకడుగు వేయక తప్పలేదు. దీంతో ఇదే విషయం వైసీపీకి వరంగా మారింది.
2019లో జగన్ నవరత్నాల హామీ
2019 నాటికి అధికారంలోకి కచ్చితంగా వచ్చి తీరాలన్న పట్టుదలతో ఉన్న జగన్... నవరత్నాల పేరుతో ఓ పద్ధతిగా హామీలు ఇచ్చారు. ఆర్ధిక పరిస్ధితి సహకరిస్తుందా లేదా అన్నది కాసేపు పక్కనబెడితే హామీలు మాత్రం అమలు చేయగలిగినవే ఇచ్చారు. దీంతో ఇప్పటికే దాదాపు 90 శాతం హామీలు నెరవేర్చేశారు. అధికారంలోకి రాగానే నవరత్నాలు కచ్చితంగా అమలు కావాల్సిందేనని అధికారులకు తేల్చిచెప్పిసిన జగన్... ఆర్ధిక పరిస్ధితితో సంబంధం లేకుండా కేటాయింపులు జరిగేలా చూశారు. దీంతో ఇప్పటికీ ఆయన అవే హామీలతో అమలవుతున్న పథకాలకు నిత్యం ప్రారంభోత్సవాలు చేస్తూ డబ్బులు బదిలీ చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ జగన్ తో పాటు వైసీపీ నేతలకు మాత్రం ఓ బెంగ మాత్రం పట్టి పీడిస్తోంది.
వైసీపీ హామీల బెంగ ఇదే
అధికారంలోకి వచ్చేందుకు తాము భారీగా హామీలు ఇచ్చాం సరే.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు వాటిని అమలు కూడా చేస్తున్నాం సరే. మరి వచ్చే ఎన్నికల్లో ఈ హామీలన్నీ అమలు చేస్తూనే మరిన్ని హామీల్ని ప్రతిపక్షం ఇస్తే అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వైసీపీకి బెంగ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా హామీల కింగ్ అయిన చంద్రబాబు తమ హామీల్ని మించిన హామీలు ఇస్తే వాటిని ఎలా కౌంటర్ చేయాలన్న దానిపై వైసీపీలో అంతర్గతంగా బెంగ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ బెంగ కాస్తా తాజాగా పార్టీలో నేతలకు హెచ్చరికల రూపంలో బయటికి వస్తోంది. దీంతో వైసీపీ ఎందుకింత బెంగ పడాల్సిన పరిస్దితులు వస్తున్నాయనే చర్చ మొదలైంది.
చంద్రబాబుపై వైసీపీ అంచనాలివే
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు భారీగా హామీలు ఇవ్వడం ఖాయమని వైసీపీ అంచనా వేస్తోంది. వీటిని ఎదుర్కొనేందుకు తాము కూడా కొత్త హామీలు ఇవ్వక తప్పని పరిస్ధితి ఎదురయ్యేలా ఉంది. కానీ ఉన్న హామీలే 2024 వరకూ కచ్చితంగా యథాతథంగా అమలు చేసేందుకు ఆర్ధిక పరిస్ధితి సహకరించడం లేదు. దీంతో ఈ హామీల విషయంలో చంద్రబాబు తమను టార్గెట్ చేస్తే, తనకు అధికారం ఇస్తే ఇంతకు మించి హామీలు ఇస్తామని ప్రకటిస్తే అప్పుడు ప్రజలు, ఓటర్లు టీడీపీవైపు మొగ్గు చూపే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే తమ ఓటు బ్యాంకు కాస్తా తిరిగి టీడీపీకి మళ్లడం ఖాయం. అందుకే ఇప్పుడు వైసీపీ కౌంటర్ ప్లాన్ సిద్దం చేసుకోవాల్సిన పరిస్ధితి వచ్చేలా కనిపిస్తోంది.
చంద్రబాబు టార్గెట్ పింఛన్లే ?
గత ఎన్నికల్లో వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టడంలో పింఛన్ల పెంపు హామీ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అవే పింఛన్లపై ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్దితి. పెంచకపోగా కోతలు సరేసరి. కానీ తాము ఇచ్చిన పింఛన్ల పెంపు హామీకి లొంగి ఓటర్లు గతంలో ఎలా ఓటేశారో వైసీపీకి తెలియంది కాదు. ఇప్పుడు చంద్రబాబు కూడా పింఛన్లు పెంచేందుకు హామీ ఇవ్వబోతున్నట్లు టీడీపీ అంచనా వేస్తోంది. అసలే తాము పింఛన్లలో కోతలు విధిస్తున్న అంశాన్ని టీడీపీ ఓవైపు జనాల్లోకి తీసుకెళ్తోంది. అదే సమయంలో పింఛన్లను గతంలో ఇచ్చిన హామీ మేరకు పెంచలేకపోతోంది. ఈ రెండు అంశాల్ని చంద్రబాబు కచ్చితంగా క్యాష్ చేసుకోవడం ఖాయమని వైసీపీ భయపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా కులసంఘాలతో జరిగిన సమావేశంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు.
Recommended Video
సజ్జల హెచ్చరికల సారాంశమిదే ?
తాజాగా అరెకటిక కులస్తుల కార్పోరేషన్ నేతలతో నిర్వహించిన సమావేశంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి వారికి పలు హెచ్చరికలు చేశారు. వచ్చే ఎన్నికల్లోపు ఏం జరగబోతోందో ఆయన వారికి విస్పష్టంగా చెప్పేశారు. చంద్రబాబు ఎన్నికలు దగ్గరయ్యే కొలది చంద్రబాబు మోసపు వాగ్దానాలు, జిమ్మిక్కులు ప్రారంభమవుతాయని సజ్జల తెలిపారు. వాటి పట్ల పేదలు, మధ్యతరగతి వర్గాల వారూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎందుకంటే పెన్షన్ ఇప్పుడు ఇస్తున్న దానికంటే అధికంగా నెలకు ఐదువేలో, పదివేలో ఇస్తానంటూ చంద్రబాబు చెబుతారన్నారు. అదే విధంగా గతంలోలా ఆచరణకు అలవి కాని వాగ్దానాలు చేస్తారన్నారు. గతంలో రైతులకు రుణమాఫి, డ్వాక్రా మహిళలకు వాగ్దానాలు చేసి ఆ తర్వాత అమలు చేయలేక మోసం చేసిన విధానం అందరికి తెలుసున్నారు. దీంతో సజ్జల వ్యాఖ్యలపై ఇప్పుడు వైసీపీతో పాటు టీడీపీలోనూ విస్తత చర్చ జరుగుతోంది.