జగన్ పార్టీలో కుదుపు: పార్టీనుండి కృష్ణంరాజు సస్పెన్షన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత రఘురామ కృష్ణం రాజును పార్టీ నుండి బహిష్కరించారు. ఆయన ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉన్నారు. అసెంబ్లీ సమన్వయకర్తల ఫిర్యాదు మేరకు పార్టీ బాధ్యతల నుండి కృష్ణం రాజును జగన్ సస్పెండ్ చేశారు.
కాగా, పార్టీలో తాను కొంత మనస్తాపంతో ఉన్న మాట విషయం నిజమేనని రఘురామ కృష్ణం రాజు ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 3 లేదా 4న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను కలిశాక నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. పార్టీ ప్లీనరీకి ఆహ్వానం అందిందని, తాను కుటుంబ సభ్యులతో వ్యక్తిగత కార్యక్రమానికి వెళ్తున్నానని, అందుకే ప్లీనరీకి హాజరు కావడం లేదని చెప్పారు. అయితే, అంతలోనే ఆయనను పార్టీ నుండి బహిష్కరించారు. మరోవైపు తానే పార్టీకి రాజీనామా చేశానని ఆయన చెబుతున్నారు.
మరోవైపు బొబ్బిలికి చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత, ఉత్తరాంధ్ర కన్వీనర్ సుజయ్ కృష్ణ రంగారావు ఆ పార్టీతో తెగదెంపులకు సిద్ధపడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సుజయ్ కృష్ణ కొద్దిరోజులుగా పార్టీ అధినేత జగన్ పట్ల అసంతృప్తితో ఉన్నారట. రానున్న ఎన్నికలకు టికెట్ల కేటాయింపు విషయంలో తనకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆయన మనస్తాపం చెందుతున్నట్టు తెలుస్తోంది.
శ్రీకాకుళానికి సంబంధించి టికెట్ల కేటాయింపు వ్యవహారాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసుకు జగన్ అప్పగించినట్లు సమాచారం. ఆ జిల్లా వ్యవహారాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దన్నట్లుగా జగన్ పరోక్షంగా సంకేతాలివ్వడంపై సుజయ్ కృష్ణ అలక వహించారట.