వద్దన్న పంచాయతీని వైసీపీ గెలిచిందిలా- విపక్షాలు, నిమ్మగడ్డపై అంచనా రివర్స్- ఫలితాలతో జోష్
ఏపీలో గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేశారన్న కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను టార్గెట్ చేసిన వైసీపీ సర్కార్ తీరా కరోనా ముగిసిన తర్వాత ఆయన ఎన్నికలు నిర్వహిస్తానంటే కుదరదంటూ మరో పోరు ప్రారంభించింది. అయితే తీరా ఎన్నికలు జరిగాక వచ్చిన ఫలితాలు చూస్తుంటే వైసీపీకే నమ్మశక్యంగా లేని పరిస్దితి కనిపిస్తోంది. మరి ఇంత పాజిటివ్ వేవ్ ఉన్న సమయంలో ఎన్నికలు వద్దని పట్టుబట్టడం వెనుక కారణాలేంటి ? రాష్ట్రంలో ఏం జరుగుతుందో అంచనా వేయడంలో విఫలమైన వైసీపీ ఎన్నికలు ప్రారంభమయ్యాక తమకు అంతా అనుకూలంగా ఉందనే అంచనాకు వచ్చిందా ?
నిమ్మగడ్డతో వైసీపీ సర్కార్ పోరు
ఏపీలో కరోనా ప్రభావం కారణంగా గతేడాది స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా పడగానే వైసీపీ సర్కార్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్పై ఉరిమింది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ ఆయనకు మేలు చేయడం కోసమే ఎన్నికలు వాయిదా వేశారంటూ సీఎం జగన్ ఆయనపై నిప్పులు చెరిగారు.
ఎన్నికల వాయిదాకు దారి తీసిన పరిస్ధితులపై సమగ్ర విశ్లేషణ జరపడానికి బదులుగా నిమ్మగడ్డను టార్గెట్ చేశారు. చివరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తప్పించారు. చివరికి కోర్టుల సాయంతో ఆయన తిరిగి పదవిలోకి వచ్చేశారు. కరోనా ప్రభావం తగ్గిందనే అంచనాకు వచ్చాక తిరిగి స్ధానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యారు.
పంచాయతీ పోరు వద్దంటే వద్దన్న వైసీపీ
స్ధానిక ఎన్నికల్లో ముందుగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఫిబ్రవరిలో నిమ్మగడ్డ ముహుర్తం పెట్టారని తెలియగానే వైసీపీ మంత్రులు, సలహాదారులు ఆయనపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఉద్యోగ సంఘాలతో కూడా దారుణంగా తిట్టించారు. మీ పంతాల కోసం మా ప్రాణాలు పోవాలా అంటూ నిమ్మగడ్డను ప్రశ్నించారు. కరోనా వేళ ఎన్నికలేంటంటూ విమర్శలకు దిగారు. చివరికి కోర్టులకు వెళ్లి మరీ ఎన్నికలు ఆపేందుకు ప్రయత్నించారు. అధికారులైతే ఏకంగా రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న నిమ్మగడ్డకు సహాయ నిరాకరణకు దిగారు. కనీసం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లు కూడా పెట్టకుండా అడ్డుకున్నారు.
సుప్రీంతీర్పుతో అయిష్టంగానే పోరు మొదలెట్టిన వైసీపీ
సుప్రీంకోర్టు ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కోరుకున్న విధంగా ఎన్నికలు జరగాల్సిందేనని తీర్పు చెప్పిందో.. ఇక అప్పటి నుంచి అయిష్టంగానే అధికారులు, ప్రభుత్వం పంచాయతీ పోరుకు సిద్ధమైంది. ఎన్నికలు మొదలైన తర్వాత కూడా మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు నిమ్మగడ్డను టార్గెట్ చేస్తూ నిత్యం విమర్శలే చేశారు. వాటిపై ఆయన చర్యలు తీసుకుని, వ్యవహారం కోర్టులకు వెళ్లే వరకూ ఈ తంతు సాగింది. చివరికి మంత్రులు, సలహాదారులు అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తొలి విడత ఎన్నికలు ఎప్పుడైతే ముగిశాయో అప్పుడు వైసీపీకి ఓ క్లారిటీకి వచ్చేసింది.
వైసీపీ ఊహకందని పంచాయతీ ఫలితాలు
పంచాయతీ ఎన్నికల ఒక్కో దశ దాటి ముందుకు వెళ్తున్న కొద్దీ వైసీపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. తాము కోరుకున్న విధంగానే క్షేత్రస్దాయిలో పరిస్ధితి ఉందని నివేదికలు రావడం మొదలుపెట్టాక వైసీపీ సైలెంట్ అయిపోయింది. చివరికి ఫలితాల్లో వైసీపీ హవా ఎప్పుడైతే కొనసాగిందో ఇక ఆ పార్టీ నేతల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చివరికి నిమ్మగడ్డపై విమర్శల దాడి కూడాఆటోమేటిగ్గా తగ్గిపోయింది.
నాలుగు దశల్లో 13, 097 పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లోవైసీపీ ఏకంగా 10, 382 సర్పంచ్లు గెల్చుకోవడం వైసీపీ నేతలకే నమ్మశక్యంగా లేకుండా పోయింది. టీడీపీ కేవలం 2063 సీట్లతో సరిపెట్టుకుంది. ఇతరులకు 475 మాత్రమే దక్కాయి. దీంతో ఎన్నికలను వైసీపీ ఎందుకు వద్దందో సగటు ఓటరుకే అర్ధం కాని పరిస్ధితి.
విపక్షాల ట్రాప్లో పడి తేరుకున్న వైసీపీ
పంచాయతీ ఎన్నికల విషయంలో వైసీపీ సాధించిన ఫలితాలు చూస్తుంటే ఓ విషయం మాత్రం స్పష్టమైపోయింది. మరో రెండు నెలల్లో రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వైసీపీ సర్కార్.. ప్రజల్లో తమపై వ్యతిరేకత ఉందనే భ్రమల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విపక్షాల విమర్శలు, వాటిని హైలెట్ చేస్తున్న మీడియాను చూసి వైసీపీలో ఏ రేంజ్లో భయం ఉందని అర్ధమైంది. ఈ ప్రభావం కచ్చితంగా ఎన్నికలపై పడుతుందని వైసీపీ భయపడినట్లు తెలుస్తోంది.
అన్నింటికంటే మించి నిమ్మగడ్డ హయాంలో ఎన్నికలు జరిగితే తాము ఎక్కడ ఓడిపోతామన్న భయం ఎక్కువగా కనిపించింది. అయితే అదంతా ఉట్టి భ్రమే అన్న వాస్తవం ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. దీంతో మున్సిపల్ ఎన్నికలకు ఆత్మవిశ్వాసంగా సిద్ధమయ్యేందుకు వైసీపీకి అవకాశం లభించింది.