మాట వినకుంటే హత్యలు, నేను జేసీ బ్రదర్స్ బాధితుడ్నే: వైసిపి నేత వ్యాఖ్యల కలకలం
వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి సీటును గెలిచి తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు కానుకగా ఇస్తామని, జేసీ సోదరులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసిపి తాడిపత్రి ఇంచార్జి కేతిరెడ్డి పెద్దిరెడ్డి.
అనంతపురం: వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి సీటును గెలిచి తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు కానుకగా ఇస్తామని, జేసీ సోదరులు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసిపి తాడిపత్రి ఇంచార్జి కేతిరెడ్డి పెద్దిరెడ్డి సోమవారం అన్నారు.
జేసీ సోదరుల దౌర్జన్యాలు, నిధుల దోపిడీ, దురుసుతనం, హత్యా రాజకీయాలతో నియోజకవర్గ ప్రజలు విసుగు చెందారని మండిపడ్డారు. వారి పాలనకు చరమగీతం పాడేందుకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్నారన్నారు.
2019 ఎన్నికల్లో తాడిపత్రిలో వైసిపి జెండా ఎగురవేస్తామని, ఈ సీటును నియోజకవర్గ ఆడపడచు అయిన విజయమ్మకు కానుక ఇస్తామని పెద్దారెడ్డి స్పష్టం చేశారు. తాడిపత్రి పట్టణంలోని ఎస్బీఎం ఫంక్షన్ హాలులో నియోజకవర్గ స్థాయి ప్లీనరీ జరిగింది.
జేసీ బ్రదర్స్ అంటేనే వణికిపోతున్నారు
ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడారు. జేసీ సోదరులపై నిప్పులు చెరిగారు. వారి అరాచకాలు రోజురోజుకూ పెరుగుతున్నాయని అన్నారు. ప్రజలు భయం భయంతో బతకాల్సి వస్తోందన్నారు. నియోజకవర్గంలో చురుగ్గా ఉన్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా జేసీ సోదరులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు.
హత్య చేసేందుకూ వెనుకాడరు
మాట వినకపోతే హత్య చేసేందుకు కూడా వెనుకాడరని పెద్దారెడ్డి అన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలా లబ్ధి పోందిన జేసీ సోదరులు.. ఇప్పుడు విజయమ్మను దూషించడం శోచనీయమన్నారు. అభివృద్ధి పేరుతో బ్రోకర్లను నియమించుకుని ప్రజాధనాన్ని దండుకుంటున్నారని విమర్శించారు.
చెక్ పోస్టులు పెట్టి ఇబ్బందులు
తాడిపత్రి పట్టణాభివృద్ధి పేరిట గ్రానైట్ యాజమాన్యాల నుంచి కప్పం డిమాండ్ చేశారని, వారు కట్టకపోవడంతో చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇబ్బందులు పెడుతున్నారని పెద్దిరెడ్డి అన్నారు. పట్టణంలో ఎక్కువ మాట్కా కంపెనీలు జేసీ సోదరుల అండతోనే నడుస్తున్నాయన్నారు.
రెడ్డి కులస్తులను ద్వేషిస్తూ..
వాటిపై ఫిర్యాదు చేస్తే ఎమ్మెల్యే అండ ఉందని పోలీసులు చెప్పడం హాస్యాస్పదమని పెద్దిరెడ్డి అన్నారు. ఇక్కడి పరిశ్రమల వల్ల జేసీ సోదరులు అభివృద్ధి చెందారే తప్ప ఏ ఒక్కరూ అభివృద్ధి చెందలేదన్నారు. రెడ్డి కులస్తులను ద్వేషిస్తూ ఆత్మాభిమానాన్ని ముఖ్యమంత్రి కాళ్ల ముందు తాకట్టు పెట్టారని విమర్శించారు.
జేసీ ఫ్యామిలీ అరాచకాల వల్ల నేను నష్టపోయా
నియోజకవర్గ ప్రజలకు, వైసిపి శ్రేణులకు ఏ అన్యాయం జరిగినా సహించేది లేదని పెద్దిరెడ్డి అన్నారు. వారికి అండగా ఉంటానన్నారు. జేసీ సొంతూరు జూటూరులో రైతుల నుంచి తక్కువ ధరకే భూములను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. జేసీ కుటుంబం అరాచకాల వల్ల నష్టపోయిన వారిలో తానూ ఉన్నానని, వారికి అడ్డుకట్ట వేయాలంటే నియోజకర్గంలోని నాయకులు, కార్యకర్తలు సైనికులుగా పని చేయాలన్నారు.