గందరగోళం!: బాబు సభలో వైసిపి తెలంగాణ ఎమ్మెల్యే, మైక్ విసిరిన మాగంటి
విజయవాడ: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు ఈ రోజు పోలవరం ముంపు ప్రాంతంలో పర్యటించారు.
ఆయన కుక్కునురులో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సభలో అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. ఆయన గత సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచారు.
అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో గల ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని కొన్ని నియోజకవర్గాల గ్రామాలు, మండలాలు ఏపీలో కలిశాయి. అందులో అశ్వారావుపేట నియోజకవర్గంవి కూడా ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితం ఎంపీ వినోద్ కుమార్ ముంపు మండలాల విషయమై లోకసభలో మాట్లాడిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీలో కలిపిన ఏడు మండలాలకు చెందిన ఎమ్మెల్యేలు ఏ రాష్ట్ర శాసన సభకు ప్రాతినిథ్యం వహించాలో తెలియడం లేదని ఎంపీ వినోద్ కుమార్ నాడు లోకసభలో అన్నారు.
ఏడు మండలాలకు చెందిన ఎమ్మెల్యేల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండు చేశారు. భద్రాచలం నియోజకవర్గంలోని తొంబై శాతం ప్రజలు ఏపీలోకి వెళ్లారని, కానీ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇరురాష్ట్రాల శాసనసభ సమావేశాలకు హాజరుకాలేక సతమతమవుతున్నారన్నారు.
విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలంగాణ, ఏపీల్లో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలన్నారు. ఏడు మండలాల్లోని ప్రజలు కూడా ఏ రాష్ట్రానికి చెందుతారో అర్థం కాని అయోమయ పరిస్థితి ఉందన్నారు. ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఇటు తెలంగాణ శాసనసభకుగానీ, అటు ఆంధ్రప్రదేశ్ శాసనసభకుగానీ హాజరయ్యే పరిస్థితి లేదన్నారు.
చంద్రబాబు సభలో మైకు విసిరిన మాగంటి
కుక్కునురు మండలం ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన ఒకింత రసాభాసగ మారింది. చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో వైదిక పైకి రాకుండా జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తమను స్టేజిపైకి రానివ్వకపోవడాన్ని జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు జీర్ణించుకోలేకపోయారు.
ఓ సమయంలో ఎంపీ మాగంటి బాబు మైకు విసిరికొట్టారు. చంద్రబాబు ముందే అది జరిగినా ఆయన ఏమనలేదని తెలుస్తోంది. ఎంపీ తీరుపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. సీఎం భద్రతను దృష్టిలో ఉంచుకొని తాము కొన్ని చర్యలు తీసుకుంటామని, వాటికి అడ్డుపడితే ఎలా అని ప్రశ్నించారు.