వైసీపీకి ప్రతిష్టాత్మకంగా తిరుపతి పోరు- అభ్యర్ధి మార్పుపై ప్రచారం- స్ధానిక పోరుకు ముందే
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. అయితే అది స్ధానిక సంస్ధల ఎన్నికలు అనుకుంటే పొరబాటే. తిరుపతి లోక్సభ స్ధానంలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో జరగాల్సిన ఉపఎన్నిక వేడి మాత్రమే. అధికార వైసీపీ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణం. అయితే వైసీపీ స్ధానిక పోరును వదిలిపెట్టి తిరుపతి ఉపఎన్నికపై దృష్టిసారించడానికి గల కారణాలపై మాత్రం ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. నిమ్మగడ్డతో సాగిస్తున్న పోరులో అనిశ్చితితో పాటు తిరుపతిలో పూర్తిగా అనుకూలంగా కనిపిస్తున్న పరిస్ధితులే ఇందుకు కారణమనే వాదన వినిపిస్తోంది. మరోవైపు తిరుపతిలో వైసీపీ అభ్యర్ధిని మార్చవచ్చనే ప్రచారం కూడా స్ధానికంగా సాగుతోంది
త్వరలో తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్
ఏపీలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్సభ స్ధానంలో ఉప ఎన్నిక నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. గతేడాది సెప్టెంబర్ 16న ఆయన కరోనా చనిపోయారు. ఆయన స్ధానాన్ని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆరునెలల్లోగా ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాబట్టి మార్చి 16లోగా అక్కడ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. అంటే కనీసం నెల రోజుల ముందైనా నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. దీంతో ఈ నెలాఖరులో తిరుపతి ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
స్ధానిక పోరుపై అనిశ్చితి
మరోవైపు ఏపీలో స్దానిక సంస్ధల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి కొనసాగుతోంది. జనవరి 23 నుంచి పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ షెడ్యూల్ ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేస్తోంది. ఈ నెల 18న హైకోర్టు నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపి నిర్ణయాన్ని వెలువరించబోతోంది. హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తే జనవరి 23 నుంచి పంచాయతీ పోరు తప్పదు. ఫిబ్రవరిలోనూ పంచాయతీ ఎన్నికలు దశలవారీగా కొనసాగనున్నాయి. అలాంటి సమయంలో తిరుపతి ఉపఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.
స్ధానికం కంటే తిరుపతిపైనే వైసీపీ దృష్టి
ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్ధితుల దృష్ట్యా స్ధానిక సంస్ధల ఎన్నికల కంటే తిరుపతి ఉపఎన్నికనే ముందుగా ఎదుర్కోవాలని వైసీపీ భావిస్తోంది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకుంటోంది. నిమ్మగడ్డ రమేష్ ఆధ్వర్యంలో జరిగే స్ధానిక సంస్ధల ఎన్నికలను న్యాయవివాదాలతో ఆలస్యం చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే తిరుపతి ఉపఎన్నికను వాయిదా వేయాలని కోరేందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సాగే స్ధానిక పోరు కంటే తిరుపతి ఉపఎన్నిక వైసీపీ సర్కారుకు ప్రతిష్టాత్మకంగా మారబోతోంది.
తిరుపతి గెలుపుతో స్ధానిక పోరుకు నాంది
తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ గెలుపు అవకాశాలు బలంగా ఉంటాయి. సిట్టింగ్ స్ధానం కావడంతో పాటు రాయలసీమలో నెలకొన్న పరిస్ధితులు, చిత్తూరు జిల్లాలో వైసీపీకి ఉన్న బలం, ఇలా పలు అంశాలు తిరుపతిలో వైసీపీకి ప్లస్గా మారబోతున్నాయి. దీంతో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన మత రాజకీయాలపై ఆధారపడక తప్పని పరిస్ధితి వచ్చేసింది. అదే స్ధానిక పోరులో అయితే స్ధానిక పరిస్ధితులు మాత్రమే విజేతలను నిర్ణయిస్తాయి. స్ధానిక పోరు ముందుగా జరిగి ఆ ప్రభావం తిరుపతిపై పడటం కంటే తిరుపతిలో గెలిచాక స్ధానిక ఎన్నికలు జరిగితేనే తమకు ప్రయోజనం ఉంటుందని వైసీపీ అంచనా వేసుకుంటోంది.
తిరుపతిలో వైసీపీ అభ్యర్ధి మార్పు ?
ఏపీలో విగ్రహాల ధ్వంసం నేపథ్యంలో మారుతున్న రాజకీయం తిరుపతిలో వైసీపీకి నష్టం చేకూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరిగే ఉపఎన్నికపై మత రాజకీయాల ప్రభావం పడితే వైసీపీకి కోలుకోలేని నష్టం జరుగుతుంది. అలాగే టీడీపీ అభ్యర్ది పనబాక లక్ష్మి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. టీడీపీ పనబాకను అభ్యర్ధిగా ప్రకటించగానే వైసీపీ కూడా జగన్ ఫిజియోథెరపిస్టు గురుమూర్తిని అభ్యర్దిగా ఖరారు చేశారు. అయితే అధికారికంగా ప్రకటన చేయలేదు. ఉపఎన్నికకు ఇంకా సమయం ఉంది. దీంతో పనబాకకు గట్టి పోటీ ఇచ్చేందుకు గురుమూర్తి స్ధానంలో మరో అభ్యర్ధిని ఎంపిక చేస్తారన్న ప్రచారం కూడా స్ధానికంగా సాగుతోంది. దీనిపై వైసీపీ నేతలెవరూ అధికారికంగా స్పందించడం లేదు.