ఎన్నికల ఖర్చు, నిధుల సేకరణలో వైసీపీనే టాప్: ఏడీఆర్ నివేదికలో వెల్లడి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష హోదాలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన కంటే ముందు పుట్టిన పార్టీలను వెనక్కు నెట్టేస్తోంది. పార్టీ పెట్టిన తొలినాళ్లలోనే ఘన విజయాలు సాధించిన ఆ పార్టీ గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అంతగా రాణించలేకపోయింది.
అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో ఎన్నికల ఖర్చులో వైసీపీ అగ్రస్థానంలో నిలిచింది. నిధుల సేకరణలోనూ కూడా మొదటి స్థానంలో నిలిచింది. గత పదేళ్లలో తెలుగుదేశంపార్టీ మూడు లోక్సభ ఎన్నికల్లో రూ.23 కోట్లు ఖర్చు చేయగా, ఒకే ఒక్క ఎన్నికల్లో పాల్గొన్న వైసీపీ మాత్రం 18 కోట్లు వెచ్చించింది.
ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్), జాతీయ ఎన్నికల వీక్షణ సంస్థలు 2004 నుంచి 2014 వరకు దేశంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో జాతీయ, ప్రాంతీయ పార్టీల నిధుల సేకరణ, ఎన్నికల వ్యయంపై అధ్యయనం చేసి సోమవారం ఓ నివేదికను విడుదల చేశాయి.
ఈ నివేదిక ప్రకారం టీడీపీ మూడు లోక్సభ ఎన్నికల్లో, టీఆర్ఎస్ రెండు, వైసీపీ ఒక లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశాయి. ఆయా ఎన్నికల్లో మొత్తంగా టీడీపీ రూ.19.71 కోట్ల నిధులను సేకరించగా.. అందులో నగదు రూపంలో అందినవి రూ.7.44 కోట్లు, చెక్కు రూపంలో వచ్చినవి రూ.12.27 కోట్లు.
టీడీపీ ఎన్నికల వ్యయం రూ.23.01 కోట్లుగా ఉంది. అందులో నగదు రూపంలో చేసిన ఖర్చు రూ.24 లక్షలు, చెక్కు రూపంలో చేసిన ఖర్చు రూ.21.93 కోట్లు. ఎన్నికల బకాయిలు రూ.84 కోట్లను ఆ పార్టీ చెల్లించాల్సి ఉంది. కాగా, టీఆర్ఎస్ ఎన్నికల నిధుల రూపేణా రూ.22.46 కోట్లను సేకరించింది.
అందులో రూ.3.78 కోట్లు నగదు రూపంలో, రూ.18.66 కోట్లు చెక్కు రూపంలో, రూ.2 లక్షలు ఉదాత్తంగా లభించాయి. అయితే టీఆర్ఎస్ ఎన్నికల ఖర్చు మాత్రం రూ.7.58 కోట్లుగా ఉంది. ఇందులో రూ.4.28 కోట్లు నగదు రూపంలో, రూ.3.3 కోట్లు చెక్కు రూపంలో ఖర్చు చేసింది. టీఆర్ఎస్కు ఎన్నికల బకాయిలు లేవు.
సాధారణంగా అసెంబ్లీలో పోటీ చేసే రాజకీయ పార్టీలకు 63 శాతం నిధులు నగదు విరాళాల ద్వారానే ఇచ్చేందుకు ప్రజలు మొగ్గుచూపుతున్నారు. 2004 నుంచి 2015 మధ్య కాలంలో 71 అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా... దేశ వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలకు మొత్తం రూ. 2,17.80 కోట్లు విరాళంగా వచ్చాయి.
పార్టీలు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన వివరాలను విశ్లేషించిన అసోసియషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ సంస్ధ ఈ నిర్ధారణకు వచ్చింది. ఏడీఆర్ వ్యవస్థాపక సభ్యులు, ఐఐటీ బెంగుళూరు ఫ్రొఫెసర్ త్రిలోచన్ శాస్త్రి సోమవారం ఈ సర్వే వివరాలను ఢిల్లీలో విడుదల చేశారు. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం చెక్కుల రూపంలోనే ఎక్కువ విరాళాలు వచ్చాయి.