చంద్రబాబు సొంత ఊర్లో వైసీపీ హవా: చంద్రగిరిలో వైసీపీ వన్ సైడ్: బాబుకు సొంత పార్టీ నేతలే షాక్...!
చంద్రగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అధినేతకు మరో షాక్. ఇప్పటికే టీడీపీ నుండి కీలక నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ మైండ్ గేమ్ ఆడుతున్న వైసీపీ..ఇప్పుడు ఏకంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం లోనూ పట్టు సాధించింది. ఊహించని విధంగా ఏకపక్షంగా విజయం దిశగా అడుగులు వేస్తోంది.
చంద్రగిరిలో చంద్రబాబుకు షాక్
చంద్రబాబు స్వగ్రామం..రాజకీయంగా చంద్రబాబు తొలుత పోటీ చేసిన చంద్రగిరి నియోజకవర్గంలో ఆయనకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చారు. 2019 సాధారణ ఎన్నికలు జరిగిన సమయంలో ఇదే నియోజకవర్గంలో అల్లర్లు జరిగాయి. టీడీపీ ఫిర్యాదుతో అక్కడ రీ పోలింగ్ కూడా జరిగింది. ఇక, ఇప్పటి స్థానిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని 95 ఎంపీటీసీల్లో 76 స్ధానాల్లో ఏకగ్రీవాలయ్యాయి. ఏకగ్రీవాలైన ఎంపీటీసీ స్ధానాలన్నీ వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. మిగిలిన 19 స్ధానాల్లో నామినేషన్ల ఉపసంహరణ సమయానికి ఏం జరుగుతుందనేది ఇప్పుడు నియోజకవర్గంలో ఉత్కంఠ కలిగిస్తోంది.
చంద్రగిరిలో ఏకపక్షంగా వైసీపీ గెలుపు బాట..
టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊరు నారావారి పల్లె ఈ చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. చంద్రబాబు ప్రస్తుతం కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నా..చంద్రగిరి సైతం ఆయనకు ప్రతిష్ఠాత్మకమే. ఈ 2014,2019 ఎన్నికల్లో ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి రెండు సార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలతో..స్థానిక ఎన్నికల సమయంలోనూ మరింత ఆందోళనకు కారణమైంది.
అయితే, ఎటువంటి టెన్షన్ లేకుండానే ఇక్కడ వైసీపీ ఏకపక్షంగా గెలుపు కోసం ప్రయత్నాలు చేసింది. తెలుగుదేశంపార్టీ నుండి ఎటువంటి పోటీ లేకపోవటంతోనే నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాలు ఏకగ్రీవాలయ్యాయి. ఏకగ్రీవాలైన ఎంపీటీసీ స్ధానాలన్నీ వైసీపీ ఖాతాలో జమ అయ్యాయి. చంద్రబాబు సొంత ఊరైన నారావారిపల్లెలో కూడా ఎన్నిక వైసీపీకి అనుకూలంగా ఏకగ్రీవమైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నా..అధికారిక సమాచారం అందాల్సి ఉంది.
పోటీలో లేకుండా టీడీపీ నేతల షాక్..
పోటీ కూడా చేయకుండానే టీడీపీ నేతలు ఎన్నికల నుండి ఎందుకు తప్పుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్న వైసీపీ తమ అధికార దుర్వినియోగంతో చంద్రగిరి మండలంలో ఆధిపత్యం కోసం అన్ని ప్రయత్నాలు చేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే, వైసీపీ మాత్రం తాము ఎక్కడా ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని..టీడీపీ నుండి పోటీకి అభ్యర్దులే ముందుకు రాలేదని చెబుతున్నారు. తాము అడ్డుకుంటే మిగిలిన 19 స్థానాల్లో మాత్రం టీడీపీ అభ్యర్దులు ఎలా పోటీలో ఉంటారని వారు ప్రశ్నిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ మండలంలో గెలుపును ప్రతి ష్ఠాత్మకంగా తీసుకోవటంతో..అక్కడ వైసీపీ ఏకపక్షంగా గెలుచుకొనే అవకాశం కనిపిస్తోంది. తొలి నుండి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ ఆధిపత్యం కోసం ఏకంగా ఎంపీ రెడ్డప్ప కు అక్కడ వైసీపీ నుండి బాధ్యతలు అప్పగించారు. ఇక, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైతం అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దీంతో..ఇప్పుడు చంద్రగిరి లో జరుగుతున్న పరిణామాలతో ఆ రెండు నియోజకవ ర్గాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.