అమెరికాలో బాబుపై ఫిర్యాదులో కొత్త ట్విస్ట్: 'టిడిపిలో గ్రూపుల వల్లే'
తమ పార్టీపై, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి నేత బొత్స సత్యనారాయణ సోమవారం మండిపడ్డారు.
విజయవాడ: తమ పార్టీపై, పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి నేత బొత్స సత్యనారాయణ సోమవారం మండిపడ్డారు.
విదేశీ పర్యటనల పేరుతో చంద్రబాబు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. అమెరికా పర్యటన అట్టర్ ప్లాప్ అయిందని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుందని, అందుకే తమ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
అమెరికాలో పరువు తీశారు!: చంద్రబాబుపై ఫిర్యాదు, జగన్ పార్టీ నిర్వాకమా?
చంద్రబాబు అమెరికా పర్యటనకు, వైసిపికి ముడిపెట్టి కొన్ని పత్రికలు, ఛానల్స్ అడ్డగోలు కథనాలను ప్రసారం చేశాయని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ జపంలా ఎప్పుడూ వైసిపిని, జగన్ను విమర్శించడమే ఈ ఎల్లో మీడియా పని అన్నారు.
బ్రేకింగ్లా..
రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పక్కన పెట్టి, వైసిపిపై దాడి చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని బొత్స అన్నారు. జగన్ అనంతపురం పర్యటనలో ఉంటే లోటస్ పాండ్లో జగన్, విజయ సాయి రెడ్డిలు చర్చిస్తున్నారంటూ ఓ ఛానల్లో బ్రేకింగ్లు వేశారన్నారు. వాస్తవాలు ప్రజలకు చేరకుండా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయన్నారు.
వైసిపి అమెరికా ప్రతినిధుల ఖండన
వైసిపిపై ఎల్లో మీడియా నిరాధార ఆరోపణలు చేస్తోందని వైసిపి అమెరికా విభాగం కన్వీనర్లు రత్నాకర్, గురువా రెడ్డిలు మండిపడ్డారు. చంద్రబాబు అమెరికా పర్యటనపై ఇర్వింగ్ పోలీసులకు వైసిపి ఫిర్యాదు చేసిందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు.
బాబుకు వ్యతిరేకంగా ఎక్కడా నిరసనలు చేపట్టలేదు
అమెరికాలో చంద్రబాబుకు వ్యతిరేకంగా డల్లాస్లో తాము ఆందోళనలు చేపట్టినట్లు టిడిపి అనుకూల మీడియా కథనాలు ప్రసారం చేయడంతో పాటు వెబ్ సైట్ కథనాలపై రత్నాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసిపి అమెరికా విభాగం తరఫున తాము ఎక్కడా ఎలాంటి నిరసనలు చేపట్టలేదన్నారు.
బాబు పర్యటన విజయవంతం కాలేదనే
ఫిర్యాదు కూడా చేయలేదని రత్నాకర్ చెప్పారు. అమెరికాలో చంద్రబాబు విజయవంతం కాలేదన్న అక్కసుతో కావాలని వైసిపిపై విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలని సవాల్ చేశారు.
టిడిపిలో రెండు వర్గాల మధ్య విభేదాలు బయటకు రాకుండా...
పార్టీ చందాలు, నిధుల సేకరణ విషయంలో స్థానికంగా టిడిపిలో రెండు వర్గాల మధ్య జరిగిన విభేదాలు బయటకు రాకుండా ఉండేందుకు వైసిపిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు తాము ఎలాంటి ఫిర్యాదులు కానీ, ఈ మెయిల్స్ కానీ చేయలేదని రత్నాకర్ అన్నారు.