బషీర్బాగ్ కాల్పులకు 20 ఏళ్లు: చంద్రన్న రక్తపాత దినోత్సవం: చరిత్ర విస్మరించదు: సాయిరెడ్డి
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న బషీర్బాగ్ పోలీసు కాల్పుల ఘటనకు శుక్రవారం నాటితో 20 సంవత్సరాలు నిండాయి. 2000 ఆగస్టు 28వ తేదీన అప్పటి చంద్రబాబు ప్రభుత్వంలో హైదరాబాద్లోని బషీర్బాగ్ పోలీసు కాల్పులతో దద్ధరిల్లి పోయింది. విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ తొమ్మిది వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా ప్రదర్శన నిర్వహించారు. ఛలో అసెంబ్లీ ఆందోళనకు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ వైపునకు దూసుకుని రావడానికి ప్రదర్శనకారులు ప్రయత్నించగా.. పోలీసులు వారిని బషీర్బాగ్ వద్ద అడ్డగించారు. ఈ సందర్భంలో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి పోలీసులు ప్రదర్శనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బాలస్వామి, విష్ణువర్ధన్, రామకృష్ణ అనే వామపక్ష పార్టీల కార్యకర్తలు మరణించారు. ఈ కాల్పుల ఉదంతాన్ని గుర్తు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కొద్దిససేపటి కిందట ట్వీట్ చేశారు.
బషీర్బాగ్ కాల్పుల ఘటనను చంద్రన్న రక్తపాత దినోత్సవంగా అభివర్ణించారు. ఆగస్టు 28వ తేదీన తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రన్న రక్తపాత దినోత్సవాన్ని జరుపుకొంటారని ధ్వజమెత్తారు. ఆగస్టు 25వ తేదీన వెన్నుపోటు దినోత్సవం, ఆగస్టు 28వ తేదీన చంద్రన్న రక్తపాత దినోత్సవాన్ని చంద్రబాబు జరుపుకొంటున్నారని విమర్శించారు. విశ్వాస ఘాతకుడిగా చంద్రబాబు 25 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారని ఎద్దేవా చేశారు.
Recommended Video
బషీర్బాగ్లో చంద్రబాబు సృష్టించిన మారణహోమానికి 20 ఏళ్లు పూర్తయ్యాయని సాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఎంత క్రూరుడో, ఎంత విధ్వంసకారుడో చరిత్రే చెబుతోందని అన్నారు. బషీర్బాగ్ కాల్పుల ఉదంతాన్ని చరిత్ర ఎప్పటికీ విస్మరించదని చెప్పారు. ఆగస్టు 25న చంద్రబాబు వెన్నుపోటు దినోత్సవాన్ని, 28వ తేదీన చంద్రన్న రక్తపాత దినోత్సవాన్ని జరుపుకొంటున్నారని చురకలు అంటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న దమనకాండకు ఇది అద్దం పడుతోందని విమర్శించారు.