చంద్రబాబు మైండ్ డీజనరేట్.. గొలుసులు రెడీ: ఊహించిందే.. ఈ ఘనత దక్కకుండా: ఏది నిజం?: సాయిరెడ్డి
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంద్రి చంద్రబాబు నాయుడిపై తరచూ ఒంటికాలి మీద లేస్తుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమ ప్రభుత్వంపై చంద్రబాబు చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంటారు. దీని కోసం ఆయన సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగించుకుంటుంటారు. మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలను సంధించారు. చురకలు అంటించారు.
ప్రాణాంతక కరోనా వైరస్ను మట్టుబెట్టడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనుగొనడానికి తానే కారణమంటూ చంద్రబాబు తాజాగా చేసిన ప్రకటన పట్ల సాయిరెడ్డి స్పందించారు. ఘాటు విమర్శలు గుప్పించారు. కరోనా వైరస్కు విరుగుడుగా హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పని చేస్తోన్న భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ మందును అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీ నాటికి ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఈ వ్యాక్సిన్ను కనిపెట్టడానికి తానే ప్రధాన కారణమని చంద్రబాబు చెప్పుకొన్నారు. తాను జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశానని, అందులో కొనసాగుతోన్న భారత్ బయోటెక్.. ఈ వ్యాక్సిన్ను కనిపెట్టిందని చంద్రబాబు వెల్లడించారు. తాను భారత్ బయోటెక్ చీఫ్తో ఫోన్లో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన ఈ ప్రకటనలను విజయసాయి రెడ్డి తప్పు పట్టారు. ఎప్పట్లాగే విరుచుకుపడ్డారు. ఘాటు విమర్శలను చంద్రబాబుపై సంధించారు.
ప్రతిదానికి కులం కార్డు ఏంటి చంద్రబాబు.. హత్యకు గురైంది బీసీ కాదా ..విజయసాయి ఫైర్
చంద్రబాబ చేసిన ప్రకటన తనకు ఏ మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదని సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నుంచి ఇలాంటి ప్రకటన ఒకటి వస్తుందనేది ఊహించిన విషయమేనని అన్నారు. ప్రపంచలో ఎక్కడ కోవిడ్ వ్యాక్సిన్ తయారైనా తన ఖాతాలో వేసుకుంటాడని ముందే ఊహించానని చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అమరావతి అనే మాయానగరంలాగే ఇదీ ఉందని ఎద్దేవా చేశారు. అమరావతి అనే మాయానగరం లాగానే చంద్రబాబు బయోటెక్ పార్క్ను సృష్టించారని మండిపడ్డారు.
ఈ వ్యాక్సిన్ తయారు చేస్తోన్నందుకు ప్రజలంతా కృతజ్ఞత వ్యక్తం చేశారట అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు మైండ్ డీజనరేట్ అవుతోందని వ్యాఖ్యానించారు. ఆయన కోసం ఇక గొలుసులను సిద్ధం చేయాల్సిందేనని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు భారతరత్న ఇప్పించానని చంద్రబాబు కోతలు కోస్తున్నారని విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విషయంలో ఆ పని ఎందుకు చేయాలేకపోయారని ప్రశ్నించారు.
Recommended Video
14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్టీ రామారావుకు భారతరత్నను ఎందుకు ఇప్పించుకోలేకపోవడానికి కారణమేంటని నిలదీశారు. రాష్ట్రపతులు, ప్రధానులను ఎంపిక చేశానని చెబుతున్న మాటలు అబద్ధాలైనా అయి ఉండాలి లేదా ఎన్టీ రామారావుకు భారతరత్న దక్కకుండా అడ్డుకోనైనా ఉండాలి అని అనుమానాలను లేవనెత్తారు. ఇందులో ఏది నిజమో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఉందని సాయిరెడ్డి అన్నారు.