కరోనాను మించిన వైసీపీ వైరస్..8 నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తుంది : చంద్రబాబు
చైనానే కాదు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకరి మీద ఒకరు కరోనా వైరస్ తో పోలుస్తూ విమర్శలు చేసుకుంటున్నారు. ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దమే కాదు కరోనా వైరస్ పేరుతో ట్వీట్ వార్ కూడా ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇక తాజాగా కరోనా వైరస్ కంటే వైసీపీ వైరస్ చాలా డేంజర్ అంటూ మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని విమర్శలు
కరోనా వైరస్ చైనాను అతలాకుతలం చేస్తుంటే.. దానిని మించిన వైసీపీ వైరస్ గత ఎనిమిది నెలలుగా ఆంధ్రప్రదేశ్ను చెల్లా చెదురు చేస్తోందని విపక్ష నేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పేరెత్తితేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని మండిపడ్డారు. ఏపీ నుండి కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు .
Recommended Video
మిలీనియం టవర్లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారని ఆరోపణలు
సీఎం జగన్ పాలనపై నమ్మకంలేకనే సింగపూర్ కన్సార్షియం, కియా అనుబంధ సంస్థలు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఆసియా పేపర్ అండ్ పల్ప్, రిలయన్స్ ఇలా అన్ని పరిశ్రమలు ఏపీ నుంచి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లుగా రాజధాని విషయంలో కూడా రచ్చ రాజేశారన్న చంద్రబాబు అమరావతిలో సచివాలయం ఉండగా విశాఖ మిలీనియం టవర్లోని కంపెనీలను తరిమేసి అక్కడ కూర్చుంటారట అని సీఎం జగన్పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా?
చంద్రబాబునాయుడు వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఒక్క కంపెనీని తీసుకొచ్చే సమర్థత లేదు, యువతకు గౌరవప్రదమైన ఒక్క ఉద్యోగం ఇవ్వడం చేతకాదు కానీ విశాఖలో లక్షణంగా ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్న 18 వేల మంది ఉద్యోగాలకు ముప్పు తెచ్చే హక్కు మీకెవరిచ్చారు? అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. సొంతంగా ఒక్క భవనం కట్టుకోలేని మీరు ఉత్తరాంధ్రను ఉద్ధరిస్తారా? అంటూ నిలదీశారు. వైసీపీ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు .