వాట్సాప్ గ్రూపుల్లో విజయమ్మ పుస్తకం "నాలో..నాతో..వైఎస్సార్ " - చర్యలు తప్పవన్న వైసీపీ...
వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన భర్త, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకాలతో తాజాగా రాసిన " నాలో.. నాతో.. వైఎస్సార్" పుస్తకాన్ని ఆయన జయంతి సందర్భంగా సీఎం జగన్ విడుదల చేశారు. ఈ పుస్తకంలో ప్రజలతో, నేతలతో వైఎస్సార్ ఎలా ఉండేవారో... కుటుంబంతో ఎలా ఉండేవారో.. ఆయన్ను దగ్గర నుంచి చూసిన సతీమణి విజయమ్మ జ్ఞాపకాల రూపంలో వివరించారు. ఈ పుస్తకాన్ని ఎమ్మెస్కో పబ్లికేషన్స్ మార్కెట్లో విడుదల చేస్తోంది.
అయితే ఈ పుస్తకం సీఎం జగన్ చేతుల మీదుగా విడుదల చేసిన రెండు రోజుల్లోనే వాట్సాప్ లో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. విజయమ్మ పుస్తకం కాపీలను పీడీఎఫ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తుండటంపై వైసీపీ సీరియస్ అయింది. ఈ పుస్తకం ప్రచురణ హక్కులు, అమ్మకం హక్కులు అన్నీ ఎమ్మెస్కో పబ్లికేషన్స్ కు మాత్రమే ఉన్నాయని, వాట్సాప్ గ్రూపుల్లో ఈ బుక్ కు సంబంధం లేని అంశాలతో ఎవరైనా సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఇవాళ హెచ్చరించారు.
Recommended Video
ఈ పుస్తకంలోని అంశాలు.. సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న పీడీఎఫ్ ఫైల్లోని అంశాలు వేర్వేరుగా ఉన్నాయని, దురుద్దేశంతో ఈ పీడీఎఫ్ఫైల్ను సర్క్యులేట్చేస్తున్నారుని సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీగారికి ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. వైయస్సార్ అభిమానులు కూడా ఈ అంశాన్ని గమనించాలని కోరుతున్నట్లు సుబ్బారెడ్డి ప్రకటనలో తెలిపారు.