వైసీపీలో ధిక్కార స్వరం: ఆ ఎంపీకి షోకాజ్ సిద్దం: వేటు వేయడానికీ: జగన్కు ఎమ్మెల్యేల ఫిర్యాదు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజుపై సంస్థాగత చర్యలను తీసుకోవడానికి సన్నాహాలు సాగుతున్నాయి. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న ఆయనకు షోకాజ్ నోటీసులను జారీ చేయాలని వైసీపీ అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత రఘురామకు షోకాజ్ నోటీసులను జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ షోకాజ్ నోటీసుకు 15 రోజుల్లోనే సంతృప్తికర వివరణ ఇవ్వలేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయవచ్చనీ అంటున్నారు.
కొద్దిరోజులుగా వార్తల్లో నానుతోన్న వ్యక్తి రఘురామ కృష్ణంరాజు. అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వపరంగా తీసుకుంటోన్న నిర్ణయాలు, చర్యలను ఆయన వ్యతిరేకిస్తున్నారు. బాహటంగా విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న టీడీపీ మాజీమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంలోనూ రఘురామ వ్యతిరేకంగా మాట్లాడారు. ధిక్కార స్వరాన్ని వినిపించారు. వైసీపీ బహిష్కరించిన కొన్ని మీడియా ఛానళ్లలో తరచూ రఘురామ కనిపిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను బతిమాలితేనే పార్టీలో చేరాననీ చెప్పుకొచ్చారు.
అసెంబ్లీ నడుస్తోన్న సమయంలోనూ రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారిని పందులతో పోల్చారు. సింహం సింగిల్గానే వస్తుంది .. పందులే గుంపుగా వస్తాయి అంటూ తాను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నరసాపురం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజీనామా చేయాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తనను విమర్శించే ఎమ్మెల్యేలు.. వైఎస్ జగన్ బొమ్మ పెట్టుకుని కూడా మరోసారి ఎన్నికల్లో గెలవలేరని, గెలిచి చూపించాలని రఘురామ సవాల్ విసిరారు.
మున్సిపల్ అధికారిణిపై బూతులతో చెలరేగిన టీడీపీ మాజీమంత్రి: నిర్భయ చట్టం కింద కేసు
రోజురోజుకూ రఘురామ ప్రభుత్వానికి, సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా రఘురామ తన వ్యాఖ్యలు తీవ్రతరం చేయడం, విమర్శల పదును పెంచడాన్ని వైసీపీ అగ్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. రవాణా శాఖ మంత్రి పేర్నినాని, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప రెడ్డి.. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, భీమవరం, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, ప్రసాదరాజు వంటి నాయకులు రఘురామ వైఖరి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. లోక్సభ టికెట్ కోసం రఘురామ మూడు పార్టీలు తిరిగినా ఎవ్వరూ టికెట్ ఇవ్వలేదని పేర్ని నాని అన్నారు.
టికెట్ కోసం తమ పార్టీని ఆశ్రయించారని, గెలిచిన తరువాత అందుబాటులో లేకుండా పోాయారని చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత ఓ నిర్ణయం తీసుకుందామని జగన్ వారికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. తొలుత షోకాజ్ నోటీసులను జారీ చేసి, సమగ్ర వివరణను తీసుకుంటారని, సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే ఆయనపై చర్యలకు దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ బాధ్యతలను పార్టీ పార్లమెంటరీ నాయకుడ వీ విజయసాయి రెడ్డికి అప్పగిస్తారని అంటున్నారు.