షాకింగ్ : లైవ్ లో విషం తాగిన వైసీపీ మహిళా నేత - సొంత ప్రభుత్వం న్యాయం చేయలేదని..
గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా తమకు పలు అంశాల్లో న్యాయం జరగలేదని తాజాగా పలువురు పార్టీ నేతలు, ప్రభుత్వాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్టీకి చెందిన మహిళా నేత జోని కుమారి విజయవాడలో ఓ ప్రెస్ మీట్లో సరిగ్గా ఇలాంటి పరిస్ధితుల్లో నిరసన వ్యక్తం చేయడానికి ఆత్మహత్యాయత్నాన్ని ఎంచుకున్నారు. ప్రెస్ క్లబ్ లో సాధారణంగా ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వచ్చిన ఆమె... మధ్యలో విషం తాగడం మొదలుపెట్టారు. చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు.
Recommended Video
లైవ్ లో ఆత్మహత్యాయత్నం...
అది విజయవాడ గాందీనగర్ ప్రెస్ క్లబ్ .. సోమవారం ఉదయం 11 గంటలకు కాస్త అటు ఇటుగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వైసీపీకి చెందిన మహిళా నేత, మాలమహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కూడా అయిన జోని కుమారి అక్కడికి చేరుకున్నారు. రాగానే ప్రెస్ మీట్ ప్రారంభించిన ఆమె.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనకు అన్నివిధాలుగా న్యాయం జరుగుతుందని ఆశించానని, కానీ తనను కొందరు మోసం చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్టీ అధినేత జగన్ ను ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా అవకాశం దక్కలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాసేపట్లోనే ఆమె తనతో పాటు తెచ్చుకున్న విషం సీసాను తెరిచి తాగడం మొదలుపెట్టారు. ముందు ఏం జరుగుతుందో అర్ధం కాక గందరగోళానికి గురైన మీడియా ప్రతినిధులు ఆ తర్వాత మరోసారి ఆమె విషం తాగి పడిపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు.
వైసీపీని సొంత కుటుంబంలా భావించా...
ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ జోని కుమారి వైసీపీని తన సొంత కుటుంబంలా భావించానని, కానీ కొందరు తనను మోసం చేసారన్నారు. కానీ మోసం చేసిందెవరో ఆమె వెల్లడించలేదు.. ఈ నెల 6వ తేదీన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిసి తన సమస్యను వివరించానని, అయినా తనకు న్యాయం జరగలేదని జోని కుమారి తెలిపారు. సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినా కుదరలేదని, దీంతో ఆయనకు ఈ-మెయిల్, ట్విట్టర్ ల ద్వారా సమస్య వివరాలు పంపానని జోని కుమారి తెలిపారు. అయినా తనకు న్యాయం జరగలేదన్నారు. మహిళల విషయంలో న్యాయం చేస్తానంటున్న వైసీపీలో పదవులు పొందిన కొందరు తనకు చేసిన అన్యాయంపై స్పందిస్తారని ఆశించినట్లు జోని కుమారి అంతకుముందు వెల్లడించారు.
నన్ను బతికించవద్దంటూ...
ప్రెస్ మీట్ జరుగుతుండగానే రెండుసార్లు తాను తెచ్చుకున్న విషం సేవించిన జోని కుమారి... ఆ తర్వాత తనను ఎవరూ బతికించవద్దంటూ కోరారు. దీంతో అక్కడే ఉన్న ఆమె కారు డ్రైవర్ 108కు ఫోన్ చేశాడు. కానీ 108 వచ్చేలోపే మీడియా ప్రతినిధుల ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు జోని కుమారిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ప్రెస్ క్లబ్ లో ఇలాంటి అనూహ్య ఘటన చోటుచేసుకోవడం, అదీ కరోనా సమయంలో కావడంతో పోలీసులతో పాటు స్ధానికులు కూడా ఉలిక్కిపడ్డారు. అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా నేత కావడం, మాలమహానాడు మహిళా అధ్యక్షురాలు కూడా కావడంతో ఈ వ్యవహారం కలకలం రేపింది.