ఏడాది ముందు కాదు, ఎలాగంటే: రాజీనామాలపై వైసీపీ వైవీ ట్విస్ట్, బీజేపీ ఎంపీ ఆగ్రహం
కర్నూలు: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
రాజీనామాపై జగన్ పక్కా ప్లాన్: సెక్షన్ 151(ఏ) ఏం చెబుతోంది? విజయసాయికి మాత్రం ఉపఎన్నిక షాక్
దీనిపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ఏడాదికి ముందు ఎన్నికలు జరగవని, అందుకే వైసీపీ రాజీనామా అంట నాటకాలు ఆడుతోందని తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇచ్చారు. దీనిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.
ఏడాది ముందు కాదు 15 నెలల ముందు
తాము స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు అందచేస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తాము పదిహేను నెలలు ముందు రాజీనామాలు అందిస్తున్నామని స్ఫష్టం చేశారు. తాము ఏడాది ముందు రాజీనామాలు ఇవ్వడం లేదని, పదిహేను నెలల ముందు ఇస్తున్నామని చెప్పారు.
టీడీపీ నేతలు ఎవరు చెప్పడానికి
తాము రాజీనామాలు చేశాక, ఉప ఎన్నికలు జరగవని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరని వైవీ సుబ్పారెడ్డి ప్రశ్నించారు. తాము హోదా కోసం ఆఖరి అస్త్రంగా రాజీనామాను ప్రయోగిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం అన్ని రకాలుగా పోరాడుతామని చెప్పారు.
చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు
రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ, తమ పార్టీ అధినేత వైయస్ జగన్ నాలుగేళ్లుగా పోరాడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
తెలుగోడి పౌరుషాన్ని చాటుతాం
తాము రాజీనామాలు చేసి తెలుగోడి పౌరుషాన్ని చాటుతామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. తమ నిర్ణయంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిందని విమర్శించారు. ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబే సిద్ధంగా లేరని చెప్పారు.
ఇలాంటి సమయంలో రాజీనామా ప్రకటన సరికాదు
మరోవైపు, ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీల రాజీనామా ప్రకటనపై బీజేపీ ఎంపీ హరిబాబు స్పందించారు. జగన్ ప్రకటనపై ఆయన మండిపడ్డారు. ఎంపీలకు ప్రజలు ఓటు వేసి, అయిదు సంవత్సరాలు పాలించమని చెబితే ఎందుకు రాజీనామా చేస్తామని ప్రశ్నించారు. విభజన సమయంలో చట్టంలో పొందుపర్చిన అంశాలను కేంద్రం అమలు చేస్తున్న సమయంలోనే జగన్ ఇలాంటి సమయంలో రాజీనామా ప్రకటన సరికాదన్నారు. రాజీనామా చేసేందుకే ప్రజలు గెలిపించారా అన్నారు.